తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఈ మూడేళ్లలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే.. ప్రజలు రాజ్ భవన్ కు ఎందుకొస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయన్నారు. వరంగల్ పర్యటనలో తనను అవమానించారన్నారు. హెలికాప్టర్ అడిగినా ఇవ్వలేదని..కారులో 8 గంటలు ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. ఎట్ హోంకు పిలిచినా ఎవరు రాలేదన్నారు.. తనను అవమానించేందుకే ఇదంతా చేస్తున్నారన్నారు. బ్లేమ్ గేమ్ మంచిదికాదన్న గవర్నర్.. సదరన్ కౌన్సిల్ భేటికీ సీఎం ఎందుకు పోలేదని ప్రశ్నించారు. తాను విమర్శలను పట్టించుకోనని.. భాద్యతలను నెరవేరుస్తానని చెప్పారు.
రాజ్ భవన్ ఏమైనా అంటరానిదా?
యూనివర్శిటీ సమస్యలపై సీఎంకు లేఖ రాశానని గవర్నర్ తమిళి సై అన్నారు. హాస్టళ్లు, హాస్పత్రుల్లో పరిస్థితులు మారాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో పరేడ్ లు ఉన్నాయన్న గవర్నర్.. తెలంగాణలో ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం మంచి కార్యక్రమాలు చేసామని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా గౌరవం అవసరం లేదని.. రాజ్ భవన్ ను గౌరవించాలన్నారు. సర్వీస్ కోటా కాబట్టే కౌశిక్ రెడ్డి ఫైల్ వెనక్కి పంపించానన్నారు. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ హాస్పత్రుల్లో చేరడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరానిదా అని ప్రశ్నించారు. వరద నష్టంపై ప్రధానికి లెటర్ రాశానన్నారు.