సిద్దిపేట, వెలుగు: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ట్వీట్ చేర్యాలకు చెందిన నిరుపేద మహిళ కుటుంబంలో వెలుగులు నింపింది. రెండు రోజుల క్రితం గవర్నర్ భైరాన్ పల్లి పర్యటనకు వెళ్తుండగా చేర్యాలకు చెందిన మల్లిగారి సంధ్యారాణి ఆమె కాన్వాయ్ ను ఆపి తన పరిస్థితి వివరించింది. దీంతో గవర్నర్ ఆమె ఇంటికి వెళ్లి దీన స్థితిని చూసి చలించిపోయారు. తనకు ఇల్లు మంజూరు కాలేదని, శిథిలావస్థలో ఉన్న ఇంట్లో కుటుంబంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నామని, చెప్పింది. దీంతో గవర్నర్ ఆమెకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత సంధ్యారాణి కుటుంబ పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్కు భారత్ బయోటెక్ కో ఫౌండర్ సుచిత్ర ఎల్లా స్పందించారు. సంధ్యారాణి పిల్లల చదువుకు సాయం చేయడమే కాకుండా జీనోమ్ వ్యాలీ క్యాంపస్లో సంధ్యారాణికి తగిన ఉద్యోగం ఇస్తామన్నారు. దీంతో గవర్నర్ ఓ పేద కుటుంబానికి దారి చూపడానికి కారణమయ్యారని, సుచిత్రా ఎల్లా చేసిన పని అందరికీ ఆదర్శమని స్థానికులు కొనియాడారు.