వెలుగు బిజినెస్ డెస్క్: గ్లోబల్గా ధరలు దిగివస్తున్న నేపథ్యంలో దేశంలోనూ వంట నూనెల రేట్లు తగ్గించాల్సిందేనని తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వేరు శనగ, సోయా, ఆవాల వంట నూనెల ప్యాకెట్లపై ఉండే మాగ్జిమమ్ రిటెయిల్ ప్రైస్ (ఎంఆర్పీ) తగ్గించాలని, ఆ బెనిఫిట్ను కన్జూమర్లకు అందించాలని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్(ఎస్ఈఏ)ను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కోరింది. దీంతో తయారీదారులందరినీ ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఈఏ సూచించింది. అదానీ విల్మార్, మదర్ డెయిరీ వంటి కొంతమంది తయారీదారులు వంట నూనెల రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు కూడా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గ్లోబల్గా వంట నూనెల రేట్లను నిరంతరం గమనించి, దేశంలో వాటి రేట్లను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంది. కిందటి ఆరు నెలల్లో గ్లోబల్గా రేట్లు బాగా తగ్గాయి. ముఖ్యంగా గత 60 రోజులలో వంట నూనెల రేట్లు అంతర్జాతీయ మార్కెట్లలో పడ్డాయి.
దేశంలో వేరుశనగ, సోయా, ఆవాల పంటల దిగుబడులు భారీగా పెరిగినప్పటికీ, వంట నూనెల రేట్లు మాత్రం కిందకి దిగలేదని ఎస్ఈఏ ప్రెసిడెంట్ అజయ్ జున్జున్ వాలా చెప్పారు. కొంత మంది వంట నూనెల తయారీదారులు ఇప్పటికే రేట్లు తగ్గించారని, కానీ వంట నూనెల ప్యాకెట్లపై ఉండే ఎంఆర్పీ మాత్రం గ్లోబల్ రేట్లకు అనుగుణంగా కనబడటం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వంట నూనెల అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఇండియా ఆధారపడుతోంది. వంట నూనెల వినియోగంలో గ్లోబల్గా మనది రెండో ప్లేస్. ఫార్చూన్ బ్రాండ్ పేరుతో వంట నూనెలు అమ్మే అదానీ విల్మార్ కంపెనీ లీటరుకు రూ.5, జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లీటరుకు రూ. 10 చొప్పున రేట్లను తగ్గిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ తగ్గింపు బెనిఫిట్ కన్జూమర్లకు రాబోయే మూడు వారాలలో అందుతుందని ఆ కంపెనీలు పేర్కొన్నాయి. దిగుమతి చేసుకున్న సోయాబీన్ ఆయిల్ రేటు ముంబైలో గత రెండు నెలల్లో 14.5 శాతం తగ్గాయి. అదేవిధంగా పొద్దుతిరుగుడు నూనె రేట్లు 10.5 శాతం దిగొచ్చాయి. వంట నూనెల రేట్లను తగ్గించాలనే నిర్ణయానికి తాము ఏప్రిల్30 నే వచ్చామని, ఈ రేట్ల తగ్గింపు ఎఫెక్ట్ కనబడటానికి రెండు నుంచి మూడు వారాల టైము పడుతుందని అదానీ విల్మార్ సీఈఓ అంగ్షు మాలిక్ చెప్పారు. గ్లోబల్గా పొద్దు తిరుగుడు నూనె రేట్లు భారీగా పతనమయ్యాయి. పామాయిల్ కంటే చీప్గా ఇప్పుడు పొద్దు తిరుగుడు నూనె దొరుకుతోంది. ఎంఆర్పీ మార్పు అనేది మా కంపెనీలో నిరంతరం కొనసాగే ప్రక్రియేనని జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి చెప్పారు. పొద్దు తిరుగుడు నూనె ఎంఆర్పీని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించి రూ. 149 కే ఇప్పుడు విక్రయిస్తున్నామని ఆయన
పేర్కొన్నారు.
లీటరుకు రూ. 20 తగ్గించిన మదర్ డెయిరీ...
ధార బ్రాండ్ పేరుతో వంట నూనెలు అమ్ముతున్న మదర్ డెయిరీ రేట్లను లీటరుకు రూ. 15 నుంచి రూ. 20 దాకా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గుదల వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించింది. సవరించిన ఎంఆర్పీతో వంట నూనెల ప్యాకెట్లు వచ్చే వారంలోనే మార్కెట్లోకి వస్తాయి.
రాబోయే మూడు నెలల్లో మరింత తగ్గుతాయ్....
వంట నూనెల రేట్లు రాబోయే మూడు నెలల్లో మరింత తగ్గుతాయని ఎస్ఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ వీ మెహతా వెల్లడించారు. రేట్ల తగ్గుదల కొంత రుతు పవనాల పైనా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. గత నెల రోజులలో వేరుశనగ, ఆవాలు, పత్తి నూనెల రేట్లు 3 నుంచి 7 శాతం మేర తగ్గాయి. దిగుమతి చేసుకునే వంట నూనెల రేట్లు తక్కువగా ఉండటంతో దేశంలో ఆవాల రేట్లు పడిపోయాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్) లెవెల్ కంటే దిగువకు ఆవాల రేట్లు చేరాయి.