న్యూఢిల్లీ: నిత్యావసర ఆహార పదార్థాల రేట్లను నిరంతరం గమనిస్తున్నామని, అలాగే సప్లయ్– డిమాండ్లనూ మానిటర్ చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి వెల్లడించారు. రైతులు, కన్జూమర్లు....ఇద్దరి ప్రయోజనాల మధ్య బాలెన్స్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ రేట్లను, వాటి లభ్యతను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఒక ప్యానెల్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ఫలితంగా, అవసరమైనప్పుడల్లా తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దేశీయంగా ఆయా ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉండేలా చూడటంతోపాటు, రేట్లను పెరగకుండా చూస్తోందని అన్నారు. ఫుడ్ ఇన్ఫ్లేషన్, నాన్–బాస్మతి రైస్ ఎగుమతిపై నిషేధం గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి పై విధంగా బదులిచ్చారు. ఇండియా పోస్ట్తో కలిసి ఐటీసీ మంగళవారం తీసుకొచ్చిన తృణ ధాన్యాల పోస్టల్ స్టాంప్ విడుదల కార్యక్రమంలో కైలాష్ చౌదరి పాల్గొన్నారు.
ఫుడ్ ఐటమ్స్ సప్లయ్ ప్రాబ్లమ్ లేదు...
డిమాండ్–సప్లయ్తో పాటు, రిటెయిల్ రేట్లను పరిశీలించే ఎగుమతి డ్యూటీ , ఇతర ఆంక్షలను ప్రభుత్వం విధిస్తుందని మంత్రి వెల్లడించారు. దేశంలో ఆహార వస్తువుల సప్లయ్ విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. కన్జూమర్లు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సమతౌల్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని కైలాష్ చౌదరి పేర్కొన్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం జూన్ నెలలో ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లేషన్ 4.49 శాతం ఎగసింది. ఇది అంతకు ముందు నెల అంటే మే 2023 లో 2.96 శాతం మాత్రమే. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ)లో సగం వాటా ఫుడ్ బాస్కెట్దే ఉంటుంది. మసాలా దినుసులు (స్పైసెస్) రేట్లు ఏడాది ప్రాతిపదికన 19.19 శాతం, తృణ ధాన్యాలు–సంబంధిత ఉత్పత్తుల రేట్లు 12.71 శాతం, పప్పులు–సంబంధిత ఉత్పత్తుల రేట్లు 10.53 శాతం, గుడ్ల రేట్లు 7 శాతం పెరిగినట్లు ఎన్ఎస్ఓ డేటా వివరిస్తోంది. అంతకు ముందు ఏడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో పండ్ల రేట్లు కూడా కొద్దిగా పెరిగినట్లు పేర్కొంటోంది.
ALSO READ :సెలబ్రిటీల్లో కానరాని ఆదర్శాలు
తృణ ధాన్యాలతో ఆరోగ్యానికి మేలు...
తృణ ధాన్యాల ఉత్పత్తి, వినియోగం దేశంలో భారీగా పెరగాలని ఈ కార్యక్రమంలో మంత్రి కైలాష్ చౌదరి సూచించారు. గ్లోబల్గా చూసినా తృణ ధాన్యాలకు డిమాండ్ ఎక్కువవుతోందని చెప్పారు. ఇండియా పెద్ద ఉత్పత్తిదారు కావడం వల్ల గ్లోబల్ డిమాండ్ పెరగడం మన దేశానికి కలిసి వస్తుందన్నారు. తృణ ధాన్యాల వినియోగం దేశంలోనూ, విదేశాలలోనూ పెరిగితే మన రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, చిన్న రైతులకు చాలా ప్రయోజనకరమని అన్నారు.