
- 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
- వెల్లడించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
న్యూఢిల్లీ: 2025–26 నాటికి ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని రూ.24 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో110 యునికార్న్లతో సహా 90 వేల కంటే ఎక్కువ స్టార్టప్లు ఉన్నాయని, వీటిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన అన్నారు. కర్ణాటకకు చెందిన కనీసం 15 లక్షల మంది యువకులకు పరిశ్రమలకు సంబంధించిన స్కిల్స్ నేర్పిస్తామని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం రూ.765 కోట్ల విలువైన ప్రొడక్షన్- లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం మరొక విడతను కేంద్రం ఆమోదించింది. దీనివల్ల ఇటీవల, యాపిల్ ఐఫోన్ చిప్ మేకర్ విస్ట్రన్తో సహా పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు మేలు జరుగుతుంది. మొత్తం రూ.765 కోట్లలో విస్ట్రన్ రూ.601.93 కోట్ల విలువైన ఇన్సెంటివ్స్ను దక్కించుకుంటుంది. డిక్సన్ టెక్నాలజీస్కు రూ.149.63 కోట్లు వస్తాయి. ఏటీ&ఎస్రూ.7.58 కోట్లు, షోగిని రూ.3 కోట్లు, ఆల్కాన్ ఎలక్ట్రానిక్స్ రూ.2.40 కోట్ల విలువైన ఇన్సెంటివ్స్ను అందుకుంటుంది. హై-ఎండ్ స్మార్ట్ఫోన్ కాంపోనెంట్లు, ఇతర ఐటీ హార్డ్వేర్ల పరికరాలను దేశంలోనే తయారు చేసేలా ప్రోత్సహించడానికి పీఎల్ఐ స్కీమును ప్రారంభించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం విలువ సుమారు రూ.10 వేల కోట్లు–12 వేల కోట్లు ఉంటుందని అంచనా. పెద్ద-స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ (ఎల్ఎస్ఈఎం) కోసం తెచ్చిన పీఎల్ఐ స్కీమ్ కింద 2022 సెప్టెంబర్ నాటికి రూ.4,784 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.80,769 కోట్ల ఎగుమతులు జరిగాయి.