హైదరాబాద్, వెలుగు: అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా సెంటర్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఐలయ్య అన్నారు. అందులో భాగంగానే నీళ్లను ఏపీకి ఇచ్చారని చెప్పారు. తన ఫామ్ హౌస్ వరకు నీళ్లు తెచ్చుకున్న కేసీఆర్.. ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల మండలాలకు మాత్రం నీళ్లివ్వలేదని వివరించారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. డిండి ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీని కాంగ్రెస్ స్టార్ట్ చేసినా వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. అందుకే నల్గొండ ఎడారిగా మారిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై చర్చకు సిద్ధమా అని సవాల్విసిరారు. నల్గొండ రైతులకు క్షమాపణ చెప్పి.. ఆ తర్వాతే అక్కడ అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలకు తామేం వ్యతిరేకం కాదని.. ధర్నాలు చేసుకునే హక్కులు లేకుండా ధర్నా చౌక్ను ఎత్తేసింది గత కేసీఆర్ సర్కారేనని వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను రెచ్చగొట్టడం కేసీఆర్కు అలవాటేనన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్ ఫ్యామిలీకే పోయాయని విమర్శించారు.