
- ఎంపీల సంతకాల సేకరణకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తీర్మానానికి ప్రతిపక్ష పార్టీలు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. త్వరలోనే సంతకాల సేకరణ ప్రారంభం అవుతుందని వివరించారు.
తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలా.. లేక రాజ్యసభలోనా.. అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. లోక్సభకు కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం అవుతాయని, రాజ్యసభకు అయితే 50 మంది మద్దతు అవసరమని వివరించారు. తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలో నిర్ణయించాకే సంతకాలు సేకరిస్తామన్నారు.
తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ అధ్యక్షత అధికారి, అవసరమైన విధానం ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని కూడా మంత్రి చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదికను పార్లమెంటు పరిశీలించవచ్చని గతంలో సూచించబడింది..కానీ ఆ అంతర్గత దర్యాప్తు కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టలేమని మంత్రి స్పష్టం చేశారు.