హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లాలో గ్రానైట్ పేలుళ్లతో భయాందోళనకు గురవుతున్నాయి. కొన్ని గ్రానైట్ కంపెనీలు ఇష్టారీతిన బ్లాస్టింగ్ చేస్తుండడంతో చుట్టు పక్కలు ఉన్న గ్రామాలు దద్దరిల్లుతున్నాయి.
జిల్లాలోని ధర్మసాగర్, ఆత్మకూరు, శాయంపేట, హసన్పర్తి, కాజీపేటతో పాటు మరికొన్ని మండలాల్లో మొత్తంగా 123 క్వారీలు ఉన్నాయి. ఇందులో 60 వరకు గ్రానైట్ క్వారీలు కాగా, మిగతావి బ్ల్యూ మెటర్, బిల్డింగ్ స్టోన్ క్వారీలు ఉన్నాయి. వాస్తవానికి క్వారీలకు మైనింగ్ లీజుతో పాటు బ్లాస్టింగ్ పర్మిషన్ కూడా ఉండాలి.
వీటితో పాటు జిలెటిన్ స్టిక్స్ వంటి పేలుడు పదార్థాలను వాడడం, రవాణా చేయడానికి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) లైసెన్స్ తీసుకోవాలి. అనంతరం ట్రైనింగ్ తీసుకున్న లైసెన్డ్స్ బ్లాస్టర్ల ఆధ్వర్యంలోనే పేలుళ్లు జరపాలి. గ్రామాలు, నీటి వనరులు, రోడ్లకు సమీపంలో పేలుళ్లు జరపకూడదన్న నిబంధన కూడా ఉంది.
కానీ ఇదేమీ పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు ఇష్టారీతిగా పర్మిషన్లు ఇస్తున్నారు. ఆలయాలు, కోనేరులు, చారిత్రక ప్రదేశాలు, స్థానికుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంతో క్వారీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
దద్దరిల్లుతున్న గ్రామాలు
గ్రామాలను ఆనుకొని ఉన్న క్వారీల్లో బ్లాస్టింగ్ చేయొద్దని రూల్స్లో ఉన్న నిర్వాహకులు పట్టించుకోకుండా బ్లాస్టింగ్లు చేస్తుండడంతో గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ సమీపంలోని ఓ స్టోన్ క్రషర్లో గురువారం రాత్రి బ్లాస్టింగ్ చేయడంతో పక్కనే ఉన్న కటాక్షపూర్, మహమ్మద్గౌస్పల్లి జనాలు ఉలిక్కిపడ్డారు.
బ్లాస్టింగ్ అనంతరం పెద్ద ఎత్తున దుమ్ము, పొగ ఆ రెండు గ్రామాలను కప్పేయడంతో శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శాయంపేట మండలం తహరాపూర్, పత్తిపాక, మాందారిపేట, హసన్ పర్తి మండలం మునిపల్లి, జయగిరి, ధర్మసాగర్ మండలం నారాయణగిరి గుట్టల్లో తరచూ బ్లాస్టింగ్స్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
రాత్రి, పగలనే తేడా లేకుండా జిలెటిన్ స్టిక్స్తో పేలుళ్లు చేస్తుండడంతో ఇండ్లు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలోనూ బ్లాస్టింగ్స్ జరుగుతుండడంతో రిజర్వాయర్కు ముప్పు పొంచి ఉందని పలువురు అంటున్నారు. క్వారీల్లో ఇష్టమొచ్చినట్లు పేలుళ్లు జరుగుతున్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బ్లాస్టింగ్స్ వ్యవహారం తమ పరిధి కాదంటే.. తమ పరిధి కాదని అటు మైనింగ్, ఇటు పోలీస్ ఆఫీసర్లు గాలికొదిలేస్తున్నారు. దుమ్ము, ధూళితో గ్రామాలు కాలుష్యం బారిన పడుతున్నా పీసీబీ ఆఫీసర్లు అటువైపు తొంగి కూడా చూడటం లేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి బ్లాస్టింగ్లను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
