హైదరాబాద్లో ప‌రుగులు తీయనున్న గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ బ‌స్సులు

హైదరాబాద్లో ప‌రుగులు తీయనున్న గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ బ‌స్సులు

హైదరాబాద్ : గ్రేటర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ బ‌స్సులు ప‌రుగులు తీయ‌నున్నాయి. ప‌ర్యావ‌ర‌ణ‌ హిత‌మైన బ‌స్సులను అందుబాటులోకి తెలంగాణ ఆర్టీసీ తీసుకొస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర ర‌వాణాశాఖ‌ మంత్రి పువ్వాడ‌ అజయ్ కుమార్ గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ బ‌స్సులను ప్రారంభించనున్నారు. దీంతో న‌గ‌రవాసులకు మ‌రింత సుఖ‌వంత‌మైన‌, సౌక‌ర్యవంత‌మైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. 

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన బ‌స్సుల‌ను పెంచే దిశ‌లో టీఎస్ ఆర్టీసీ క‌స‌ర‌త్తు చేసి.. ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. నూత‌నంగా గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ బ‌స్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. బుధ‌వారం (సెప్టెంబర్ 20వ తేదీ) నుంచి ఈ బ‌స్సులు న‌గ‌రంలో ప‌రుగులు తీయ‌నున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ స‌ర్వీసుల్లో మొద‌టి విడ‌త‌గా 25 బ‌స్సులను ప్రారంభించనున్నారు. 

బుధ‌వారం రోజు ఈ బ‌స్సులను మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ గ‌చ్చిబౌలి స్టేడియం ద‌గ్గర ప్రారంభించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధన్‌, ఎండీ స‌జ్జనార్‌ కూడా పాల్గొననున్నారు. మిగిలిన 25 బ‌స్సులను న‌వంబ‌రు నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.

ఈ బ‌స్సులు వంద శాతం వాయు కాలుష్యాన్ని వెద‌జ‌ల్లవని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీట‌ర్లు ప్రయాణించే సౌల‌భ్యం ఉంటుంది. 3 గంట‌ల‌ నుంచి 4 గంటల లోపు వంద శాతం పూర్తి ఛార్జింగ్ అవ్వడ‌మే కాకుండా క్యాబిన్, సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, ఒక నెల బ్యాకప్ స‌దుపాయాలు క‌లిగి ఉన్నాయి.  

గ్రీన్ లగ్జరీ ఏసీ బ‌స్సుల ప్రత్యేక‌త‌లు ఇవే...

* 12 మీటర్ల పొడవు గల ఈ గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సులు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 

* 35 సీట్ల సామర్థ్యం గ‌ల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం ఉంది. వాటిని టీఎస్‌ ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్ నకు అనుసంధానం చేశారు.

* ప్రతి బస్సులోనూ 2 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనుక ఎల్ఈడీ బోర్డులు ఉంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి. 

* అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి.. నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో  ఉంటుంది.