పెండ్లి రోజు వరుడి డెడ్ బాడీ లభ్యం

పెండ్లి రోజు వరుడి డెడ్ బాడీ లభ్యం

లింగంపేట, వెలుగు: పెండ్లి శుభలేఖలు పంచి వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోయిన వరుడు సరిగ్గా పెండ్లి రోజే శవమై తేలాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్​మండలం అడ్లూర్​ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మోసర్ల రాజేందర్(25) స్థానికంగా ప్రైవేట్ జాబ్​ చేస్తున్నాడు. ఇతనికి రెండు నెలల కింద నిజామాబాద్ ​జిల్లాకు చెందిన యువతితో పెండ్లి ఫిక్స్ అయింది. ఈ నెల 7న(గురువారం) వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులంతా పెండ్లి పనుల్లో నిమగ్నమై శుభలేఖలు ప్రింట్​చేయించారు. 

ఈ నెల 3వ తేదీన తన అన్న శ్యామ్​తో కలిసి రాజేందర్ ​బంధువులకు వాటిని పంచి వచ్చారు. అదేరోజు సాయంత్రం బైక్ పై ఊర్లోకి వెళ్లొస్తానని చెప్పి బయలుదేరిన రాజేందర్​ అర్ధరాత్రికి కూడా తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సదాశివనగర్ ​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

గురువారం లింగంపేట మండలం ముస్తాపూర్​శివారులోని కొత్తచెరువు కట్ట కింద ఉన్న చెట్టుకు కుళ్లిపోయిన స్థితిలో ఓ శవం వేలాడుతున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూశారు. అక్కడి ఆనవాళ్ల ప్రకారం మృతుడు రాజేందర్ గా గుర్తించారు. ఘటనా స్థలంలోనే  పోస్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్సై ప్రకాశ్​జాదవ్​ తెలిపారు. రాజేందర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.