- ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచనల మేరకు చర్యలు
- వాటి రిపోర్టులను వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీపై ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీ ప్రదేశంలో మరిన్ని టెస్టులు చేస్తున్నారు. నేల పరిస్థితులను అంచనా వేసే పరీక్షలు చేస్తున్నారు. గత నెలలో బ్యారేజీని పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ.. బ్యారేజీల వద్ద మరిన్ని టెస్టులు చేయాలని సూచించింది. బ్యారేజీ కుంగడానికి డిజైన్ల లోపమా లేదా అక్కడి నేల పరిస్థితులా అన్నది తేల్చేందుకు టెస్టులు చేయాలని ఆదేశించింది. జియోఫిజికల్ టెస్టులతో పాటు ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టెస్టు, జియో పెనట్రేషన్ రెసిస్టివిటీ పరీక్షలు చేయాలంది.
దీంతో బ్యారేజీ ఎగువ, దిగువన టెస్టులు చేస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఎగువన ఇప్పటికే టెస్టులు పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం బ్యారేజీ దిగువన టెస్టులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ టెస్టులు పూర్తిచేసి రిపోర్టులు పంపాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆ టెస్టులు త్వరగా పూర్తి చేసి రిపోర్టులు పంపిస్తే.. వాటిలో పేర్కొన్న అంశాలు, నిపుణుల కమిటీ పరిశీలించిన అంశాల ఆధారంగా ఎన్డీఎస్ఏ రిపోర్టును తయారు చేసే అవకాశాలు ఉన్నాయి.
కాగా, బ్యారేజీకి సంబంధించి నివేదికను త్వరగా ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టు తెలిసింది. మరో 2 నెలల్లో ఫ్లడ్ సీజన్ ప్రారంభం కానున్నందున ఆ రిపోర్టు ఆధారంగానే చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది.