జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష..  ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహణ 

జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష..  ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహణ 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్‌-1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే దీనిని పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్‌ పద్ధతిలోనే జరుపనున్నట్లు స్పష్టం చేసింది.  రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబర్‌ 16న పరీక్ష జరిగింది. ఇక మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 2,85,916 మంది పరీక్షను రాశారు. వీరిలో 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తూ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. అయితే అనూహ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది.

ప్రత్యేకంగా పరీక్ష విభాగం

అనంతరం మళ్లీ కొత్త తేదీలను ప్రకటించిన కమిషన్ గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పరీక్ష విభాగాన్ని తీసుకొచ్చింది. టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌గా బీఎం సంతోష్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌ రెడ్డిని నియమించింది. అలాగే కొత్తగా డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, సీనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, జూనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ ప్రోగ్రామర్‌, జూనియర్‌ ప్రోగ్రామర్‌, లా ఆఫీసర్‌ (జూనియర్‌ సివిల్‌ జడ్జి క్యాడర్‌) పోస్టులను మంజూరు చేసింది. గతంలో పనిచేసిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అందరినీ మార్చడంతో పాటుగా మళ్లీ కొత్తగా ప్రశ్నపత్రాలను రూపొందించింది.

 ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్ష

కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేలలోపు అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు ఉంటే, రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్‌ పద్ధతిలో లెక్కిస్తున్నారు. ఇక లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను సైతం ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. దీంతో ఆన్‌లైన్‌ పరీక్ష రాసేందుకు అభ్యర్థుల సంఖ్యను 25వేల నుంచి 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.