
- గ్రూప్–1 పేపర్..
- న్యూజిలాండ్కు
- అక్కడుంటున్న తన బావ
- ప్రశాంత్కు షేర్ చేసిన రాజశేఖర్
- 103 మార్కులు స్కోర్ చేసిన ప్రశాంత్
- అతడి ద్వారా మరి కొంతమందికీ లీక్!
- ఇప్పటికే 40 మంది విచారణ పూర్తి
- ఆరుగురు టీఎస్పీఎస్సీ సిబ్బందికి క్లీన్ చిట్
- 19 మంది సాక్షులతో సిట్ రిమాండ్ రిపోర్టు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 పేపర్ దేశం దాటినట్టు సిట్గుర్తించింది. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్రెడ్డి.. న్యూజిలాండ్లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్రెడ్డికి వాట్సాప్లో పేపర్షేర్ చేసినట్లు విచారణలో తేల్చింది. దీంతో అతడికి నోటీసులు జారీ చేసింది. ప్రశాంత్రెడ్డి పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్ వెళ్లిపోవడంతో వాట్సాప్, మెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఐతే సిట్ నోటీసులకు ప్రశాంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.
దీంతో లుకౌట్ నోటీసులు ఇష్యూ చేసేందుకు సిట్ అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రూప్–1, ఏఈ పేపర్ సహా ఆరు పేపర్స్ లీకేజీ వివరాలు సేకరించేందుకు నిందితులను మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, ధాక్యా నాయక్, రాజేశ్వర్లతోపాటు షమీమ్, రమేశ్, సురేశ్ను ఆరురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై శనివారం విచారణ జరుగనుంది.
న్యూజిలాండ్లో ప్రిపరేషన్.. ఇక్కడ పరీక్ష
గ్రూప్–1 పేపర్ను రాజశేఖర్రెడ్డి న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్రెడ్డికి వాట్సాప్లో షేర్ చేసినట్లు సిట్ గుర్తించింది. న్యూజిలాండ్లోనే పరీక్షకు ప్రిపేర్ అయిన ప్రశాంత్రెడ్డి.. ఇక్కడికొచ్చి పరీక్ష రాశాడు. ప్రశాంత్ ద్వారా మరికొంత మందికి పేపర్ చేరి ఉంటుందని సిట్ అనుమానిస్తోంది. ఇక టీఎస్ పీఎస్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న దామెర రమేష్కు కూడా రాజశేఖర్ ద్వారానే పేపర్ వెళ్లింది.
ప్రవీణ్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్కు చేరింది. వీరితో పాటు మాజీ టెక్నీషియన్ సురేశ్ కూడా ఎగ్జామ్ రాశాడు. ఇలా పరీక్షలు రాసిన వీరందరికీ 100పైగా మార్కులు వచ్చాయి. ఈ వివరాలన్నీ
ప్రవీణ్, రాజశేఖర్ సిట్ కస్టడీ విచారణలో వెల్లడించారు. దీంతో షమీమ్, రమేశ్, సురేశ్ను సిట్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది.
టీఎస్ పీఎస్సీలో ఆరుగురికి క్లీన్ చిట్
గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన 26 మంది టీఎస్ పీఎస్సీ ఉద్యోగులను ఇప్పటికే సిట్ ప్రశ్నించింది.100కు పైగా మార్కులు వచ్చిన 8 మందిలో షమీమ్, రమేశ్ మినహా మిగితా ఆరుగురు ఉద్యోగులకు పేపర్ లీకేజ్తో సంబంధం లేదని గుర్తించారు. ఈ క్రమంలోనే 100కు పైగా మార్కులు వచ్చిన121 మంది అభ్యర్థులను సిట్ విచారిస్తున్నది. ఇందులో 40 మంది విచారణ ఇప్పటికే పూర్తయింది. వీరిలో టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేశ్ లీకేజీ పేపర్తో పరీక్ష రాసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. మిగతా వాళ్లకు పేపర్ లీకేజీతో సంబంధం లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చారు. టాప్ మార్కులు స్కోర్ చేసిన మరో 80 మందిని విచారిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్లతో కాంటాక్ట్లో ఉన్న వారి వివరాలను కూడా సిట్సేకరించనుంది.
హోటల్లో ఏఈ ఎగ్జామ్కు ప్రిపరేషన్
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రమేశ్, మాజీ టెక్నీషియన్ సురేష్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ కీలక వివరాలు వెల్లడించింది.12 మంది నిందితులు 19 మంది సాక్షులతో కూడిన రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకు అందించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని ఇందులో ప్రధాన సాక్షిగా పేర్కొన్నారు. నిందితుడు ప్రవీణ్కు అసిస్టెంట్గా పనిచేస్తున్న కనం అనురాజ్, రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న హరీష్ను సాక్షులుగా పేర్కొన్నారు. రేణుక, ఆమె భర్త కర్మాన్ఘాట్లోని ఆర్ స్క్వేర్ హోటల్ రూమ్ నెంబర్107, 108లో నీలేష్, గోపాల్ను ఏఈ పరీక్షకు ప్రిపేర్ చేయించారని పేర్కొన్నారు. ఆ తర్వాత 5వ తేదీ ఉదయం సరూర్నగర్లోని ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లి పరీక్ష రాయించారని వివరించారు. హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ను సిట్ అధికారులు సేకరించారు. హోటల్ ఓనర్ రాఘవేందర్ రెడ్డి, రిసెప్షనిస్టు ర్యాకల ప్రశాంత్ను సాక్షులుగా చేర్చారు.
సిట్ అదుపులోకి మరొకరు
నవాబుపేట, వెలుగు: పేపర్ల లీకేజీ కేసులో మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలానికి చేరుకున్న అధికారులు.. ఈజీఎస్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ)గా పని చేస్తున్న అలీపూర్ ప్రశాంత్రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అతన్ని నవాబ్ పేట పోలీస్ స్టేషన్లో సీక్రెట్గా విచారిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి ఏఈఈ పేపర్ కొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గతంలో ఓ హాస్టల్లో ఉండి గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ఆ హాస్టల్ లోని కొంతమంది ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. వీరిలోని చాలామంది పేపర్ల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్నారు. అదే గ్రూపులో ప్రశాంత్ రెడ్డి కూడా ఉండడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.