న్యూఢిల్లీ: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.21 వేల కోట్ల పన్ను చెల్లించాలంటూ జీఎస్టీ ఇంటెలిజెన్స్ యూనిట్ బెంగళూరుకు చెందిన ఆన్లైన్ గేమింగ్ స్టార్టప్ గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ (జీటీపీఎల్)కి షోకాజ్ నోటీసును జారీ చేసింది. పరోక్ష పన్నుల చరిత్రలో ఇదే అతిపెద్ద నోటీసు అని తెలిపింది. గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ కార్డ్, క్యాజువల్, ఫాంటసీ గేమ్లైన రమ్మీ కల్చర్, గేమ్జీ, రమ్మీ టైమ్ మొదలైన వాటి ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ను ప్రోత్సహిస్తోందని తెలిపింది. గేమ్స్క్రాఫ్ట్ తన కస్టమర్లకు ఎలాంటి ఇన్వాయిస్లనూ జారీ చేయడం లేదని కూడా అధికారులు గుర్తించారు. నేషనల్ మీడియా రిపోర్టుల ప్రకారం... జీఎస్టీ అధికారులు దాదాపు 77వేల కోట్ల రూపాయల బెట్టింగ్ మొత్తంపై 28 శాతం పన్ను విధించారు.
జీటీపీఎల్ ఆన్లైన్ కార్డ్ గేమ్లపై డబ్బును వాటాల రూపంలో పందెం వేయడానికి అనుమతిస్తుందని పన్ను అధికారులు పేర్కొన్నారు. విచారణ సమయంలో ఈ గేమింగ్ ప్లాట్ఫాం ఇచ్చినవి నకిలీ/బ్యాక్ డేట్స్ ఇన్వాయిస్లని ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా తేలింది. వాలెట్లో డబ్బు జమ చేసిన తర్వాత తిరిగి అది వెనక్కి వచ్చే మార్గం లేకపోవడంతో కంపెనీ తన కస్టమర్లతో బలవంతంగా బెట్టింగ్ ఆడిస్తోంది. గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్ బెంగళూరు నగరంలో ఐదు అపార్ట్మెంట్లను సుమారు రూ. 32 కోట్లకు కొనుగోలు చేసిందని గత ఏడాది కూడా వార్తలు వచ్చాయి. సేల్ అగ్రిమెంట్ గత ఆగస్టులో జరిగింది.