న్యూఢిల్లీ: కిందటి నెలలో జీఎస్టీ కలెక్షన్ రూ. 1.30 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్ 2020 లో వచ్చిన జీఎస్టీ రెవెన్యూతో పోలిస్తే కిందటి నెలలో వచ్చిన జీఎస్టీ రెవెన్యూ 13 శాతం ఎక్కువ. కానీ, నవంబర్, 2021లో వచ్చిన జీఎస్టీ రెవెన్యూతో పోలిస్తే మాత్రం తక్కువ. నవంబర్లో రూ. 1.31 లక్షల కోట్లను జీఎస్టీ కింద ప్రభుత్వం సేకరించగలిగింది. ఎకానమీ పుంజుకోవడం, జీఎస్టీ ఎగ్గొట్టకుండా కఠినమైన రూల్స్ను తీసుకొస్తుండడంతో జీఎస్టీ రెవెన్యూ పెరుగుతోందని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. కాగా, డిసెంబర్ను కూడా కలుపుకుంటే వరసగా ఆరు నెలల్లో దేశ జీఎస్టీ కలెక్షన్ రూ. లక్ష కోట్లను దాటింది. ‘కిందటి నెలలో 1,29,780 కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. ఇందులో సెంటర్ జీఎస్టీ రూ. 22,578 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ. 28,658 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 69,155 కోట్లు. ఇందులో దిగుమతులపై వేసిన రూ. 37,527 కోట్లు కలిసున్నాయి. సెస్ రూ. 9,389 కోట్లు కాగా, ఇందులో ఇంపోర్ట్ గూడ్స్ నుంచి రూ. 614 కోట్లు వసూలయ్యాయి’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.