న్యూఢిల్లీ: జీఎస్టీ జులై వసూళ్లు రూ. 1.65 లక్షల కోట్లకు పెరిగాయి. వసూళ్లు వరసగా రెండో నెలలోనూ రూ. 1.60 లక్షల కోట్లను దాటడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.61 లక్షల కోట్లయితే, మే 2023 జీఎస్టీ వసూళ్లు రూ. 1.57 లక్షల కోట్లు. అంతకు ముందు ఏడాది అంటే 2022 జులై నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్లో తెలిపింది.2022 జులై నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.49 లక్షల కోట్లే. జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి చూస్తే రూ. 1.60 లక్షల కోట్లకు మించి వసూలవడం ఇది ఆరోసారని పేర్కొంది. పన్ను ఎగవేతదారులపై తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వడంతోపాటు, కన్జూమర్లు తమ ఖర్చులను పెంచడం వల్లే జులై నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయని ఫైనాన్స్ మినిస్ట్రీ చెబుతోంది.
జులై నెలలో సీజీఎస్టీ రూ. 29,773 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 37,623 కోట్లు, ఐజీఎస్టీ రూ. 85,930 కోట్లు, సెస్ రూ. 11,779 కోట్లు వసూలైనట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ డేటా వెల్లడించింది.
జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్లో రూ. 1.87 లక్షల కోట్లకు ఎగసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దిగుమతులు సహా దేశీయ ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ వసూళ్లు అంతకు ముందు ఏడాదిలోని జులై నెలతో పోలిస్తే ఈ ఏడాది జులై లో 15 శాతం పెరిగినట్లు డేటా వివరించింది. ఇండ్లు, కార్లు, వెకేషన్స్, ఇతర కన్జూమర్ ఐటమ్స్పై ఖర్చు పెరగడం వల్ల జీఎస్టీ కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయని ఎన్ఏ షా అసోసియేట్స్పార్ట్నర్ పరాగ్ మెహతా చెప్పారు. జీఎస్టీఎన్ నెట్వర్క్ పటిష్టంగా ఉండటం వల్ల పన్ను ఎగవేతదారులను తొలిదశలోనే కనుగొనే వీలు కలిగిందని, ఫేక్ ఇన్వాయిసింగ్కు పాల్పడుతున్న వారిపై వెంటనే జీఎస్టీ అధికారులు చర్యలు తీసుకోగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ పరిశ్రమలకు జీఎస్టీ పై ఉండే సందేహాలను జీఎస్టీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు తీరుస్తుండటం కూడా మంచి పరిణామమని, దీంతో చట్టంపై క్లారిటీ పెరిగి తద్వారా వసూళ్లు అధికమవుతున్నాయని వివరించారు. ఈ–ఇన్వాయిసింగ్ లిమిట్స్ను తగ్గించుకుంటూ రావడం కూడా మంచి ఫలితాలను ఇస్తోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎం ఎస్ మణి చెప్పారు. రాష్ట్రాలవారీగా జీఎస్టీ ఆడిట్ల సంఖ్య కూడా పెరుగుతోందని, ఇది కూడా సత్ఫలితాలు తెస్తోందని పేర్కొన్నారు.
ఆరు రాష్ట్రాల నుంచే 60 శాతం వసూళ్లు....
దేశంలోని ఆరు కీలక రాష్ట్రాల నుంచే జీఎస్టీ వసూళ్లలో 60 శాతం సమకూరుతున్నాయి. జులై నెలలోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయింది. దేశంలోని బిజినెస్లకు జీఎస్టీ పై అవగాహన బాగా పెరిగిందని, నెలవారీ వసూళ్లు నిలకడగా రూ. 1.60 లక్షల కోట్లను దాటుతుండటమే దీనికి నిదర్శనమని మణి పేర్కొన్నారు. రాబోయే ఫెస్టివల్ సీజన్లో జీఎస్టీ వసూళ్లు మరింత పెరుగుతాయని కేపీఎంజీ ఇండియా నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ చెప్పారు.