ఏడాదిగా జీతాల్లేవ్.. ఇంకెప్పుడిస్తరు?

ఏడాదిగా జీతాల్లేవ్.. ఇంకెప్పుడిస్తరు?

విద్యాభవన్​ను ముట్టడించిన గెస్ట్​ లెక్చరర్లు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్​ లెక్చరర్లను రెగ్యులర్​ చేయడంతోపాటు ఏడాదిగా పెండింగ్​లో ఉన్న జీతాలను చెల్లించాలని గెస్ట్​ లెక్చరర్ల సంఘం డిమాండ్​ చేసింది. ఈమేరకు శుక్రవారం నాంపల్లిలోని విద్యాభవన్ ముందు సంఘం నేతలు, సభ్యులు మహా ధర్నా చేశారు.

గెస్ట్​ లెక్చరర్ల ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల నుంచి తరలి వచ్చిన గెస్ట్​లెక్చరర్లు విద్యాభవన్​ ముందు ఆందోళన చేస్తుంటే చర్చలకు పిలవకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు.  రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 863 మంది గెస్ట్ లెక్చరర్లు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని అన్నారు. మార్చిన రూల్స్​తో కుటుంబాలన్నీ రోడ్డున పడతాయన్నారు. వీరందరినీ క్రమబద్ధీకరించాలని సీఎం​కు ఆయన విజ్ఞప్తి చేశారు. తర్వాత కమిషనర్​ నవీన్​మిట్టల్​తో చర్చలు జరిపి, గెస్ట్​లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్​సానుకూలంగా స్పందించినట్లు కృష్ణయ్య తెలిపారు. ఆరు నెలల జీతం వెంటనే విడుదల చేస్తామని, మిగతా జీతానికి సంబంధించి వివరాలు సేకరించి పది రోజుల్లో చెల్లిస్తామని కమిషనర్​చెప్పారన్నారు. అదేవిధంగా 15 ఏళ్ల అనుభవం ఉన్న గెస్ట్​లెక్చరర్లను కొనసాగించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని మిట్టల్​హామీ ఇచ్చారన్నారు.