గుజరాత్ లో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత

గుజరాత్ లో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత

గుజరాత్‌లో విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) అధికారి ప్రకారం, నవంబర్ 27న రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అకాల వర్షాలే కాకుండా పిడుగుపాటు వల్ల కూడా ఈ మరణాలు సంభవించాయి. దాహోద్ జిల్లాలో నలుగురు, బరూచ్‌లో ముగ్గురు, తాపీలో ఇద్దరు, అమ్రేలి, బనస్కాంత, మెహసానా, పంచమహల్, దేవ్‌భూమి ద్వారక, అహ్మదాబాద్, సబర్‌కాంత, సూరత్, బొటాడ్, ఖేదా, సురేంద్రనగర్ లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఎస్‌ఈఓసీ అధికారులు తెలిపారు.  

షా సంతాపం

రాష్ట్రంలోని అనేక నగరాల్లో తీవ్రమైన వాతావరణం, పిడుగుపాటు కారణంగా సంభవించిన మరణాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక పరిపాలన అధికారుల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన ఎక్స్‌లో రాశారు.

నవంబర్ 27న వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. SEOC డేటా ప్రకారం, గుజరాత్‌లోని 234  తాలూకాలలో నవంబర్ 26న భారీ వర్షపాతం నమోదైంది, సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్, అమ్రేలి జిల్లాల్లో 16 గంటల్లో 50-117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.