హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. జూన్ 27న రాత్రి గుజరాత్ ఏటీఏస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ) అధికారులు హైదరాబాద్ ,రామగుండంలో తనిఖీలు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. టోలీచౌక్ కు చెందిన మహమ్మద్ జావిద్ తో పాటు అతని కూతురు ఖతిజాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ లో జావిద్ సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రీ కూతుళ్లు టోలీచౌక్ లో ఉంటున్నారు. బక్రీద్ కోసం గోదావరిఖనికి వెళ్లినట్లు తెలుస్తోంది. అమీర్ పేటలోని పలు కోచింగ్ సెంటర్లపై ఏటీఎస్ బృందం తనిఖీలు చేసింది. కోచింగ్ పేరుతో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారనే అనుమానాలతో కోచింగ్ సెంటర్లలో తనిఖీలు చేసింది.
ఇటీవల పొరుబందర్లో పట్టుబడ్డ ఐఎస్ కేపీ(ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావెన్సీ) ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీయగా.. పాతబస్తీలో ఉగ్ర కార్యకలాపాలు నడిపేందుకు ప్రయత్నించిన సుబేరాభాను అనే మహిళను అహ్మదాబాద్ ఏటీఎస్ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఫసీఉల్లా అనే వ్యక్తితో సుభేరా భానుతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఫసీని కూడా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో తనఖీలు చేసింది గుజరాత్ ఏటీఎస్ బృందం.
ఐఎస్ఐఎస్ కు ఐఎస్ కేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలలో సుబేరా భాను అనే యువతీ ప్రధాన సూత్ర దారిగా వ్యవహరిస్తోంది. సుబేరా భాను పలువురుని ఆన్ లైన్ ద్వారా ఉగ్ర కార్యకలాపాల్లోకి లాగుతున్నట్లు గుర్తించారు.