
ముంబై : ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ తొమ్మిదో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో 30–37 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో కంగుతిన్నది. కెప్టెన్ పవన్ షెరావత్ (8), సంజీవి (7) రాణించినా మిగతా వారు రైడింగ్, డిఫెన్స్లో నిరాశపర్చారు. గుజరాత్ రైడర్ రాకేశ్ 10 పాయింట్లు సాధిస్తే, డిఫెండర్ దీపక్ సింగ్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఫజల్ (3) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 41–31తో యు ముంబాపై నెగ్గింది. రైడర్ అర్జున్ దేశ్వాల్ (17), అజిత్ (6), అంకుష్ (5) చెలరేగారు. యు ముంబాకు గుమన్ సింగ్ 13 పాయింట్లు అందించినా ప్రయోజనం లేకపోయింది.