స్పెషల్ ఫ్లైట్ లో లండన్ వెళ్లాల్సిన ఎన్నారై తన తండ్రి చేతిలోనే హతమయ్యాడు. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రాదన్న భయంతో జరిగిన గొడవలో క్షణికావేశంతో కత్తితో దాడి చేయడంతో ఘోరం జరిగిపోయింది. గుజరాత్ లోని సూరత్ లో ఈ దారుణం జరిగింది.
సూరత్ లోని భర్బంధ్వావ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హమీద్ అనే వ్యక్తి ఏకైక కుమారుడు ఇమ్రాన్ (36) లండన్ లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. పదేళ్లుగా అక్కడే సెటిల్ అయిన అతడు గత నెలలో భార్య, కుమారుడితో కలిసి సూరత్ వచ్చాడు. ఇంటిలో కొన్ని పనులు చేయించేందుకు తండ్రి దగ్గర లక్షా 80 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా విమానాలు నిలిచిపోవడంతో భారత్ లో నిలిచిపోయిన యూకే పౌరుల కోసం ఆ దేశం శనివారం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. అందులో ఇమ్రాన్ కూడా లండన్ వెళ్లాల్సి ఉంది.
అతడు వెళ్లిపోతే అప్పుగా ఇచ్చిన డబ్బు మళ్లీ ఎప్పటికి ఇస్తాడోన్న అనుమానంతో తండ్రి హమీద్ ఆ సొమ్ము గురించి శుక్రవారం రాత్రి అడిగాడు. అయితే తన స్నేహితుల దగ్గర ఇప్పటికే కొన్ని అప్పులు తీసుకుని ఉన్నానని, అవి కట్టేశాక ఇస్తానని తండ్రికి చెప్పాడు ఇమ్రాన్. అప్పటి వరకు ఇంటిలో తన భాగాన్ని కిరాయి ఇచ్చి ఆ సొమ్ము జమ చేసుకోవాలన్నాడు. దీని గురించి కొడుకును ఏమీ అనలేకపోయిన అతడు.. ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లి భార్యతో ఈ విషయం చెప్పాడు. వారిద్దరి మధ్య ఆ మాటలు పెరిగి.. గొడవగా మారింది. తల్లిదండ్రుల అరుపులు విన్న ఇమ్రాన్ ఆ గదిలోకి వెళ్లడంతో అతడిపై గొడవకు దిగాడు తండ్రి హమీద్. మాటామాటా పెరిగి పోట్లాటకు దారితీసింది. క్షణికావేశంలో హమీద్ అతడి కొడుకు ఇమ్రాన్ భుజంపై దాడి చేశాడు. అంతలోనే తేరుకుని అతడిని హాస్పిటల్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీని కేసు నమోదు చేసిన పోలీసులు.. హమీద్ ను అరెస్టు చేశారు.