గురుకులం.. ఇరుకుటం..ఒకే క్యాంపస్​లో రెండు స్కూల్స్​, 3 జూనియర్, 2 డిగ్రీ కాలేజీలు

గురుకులం.. ఇరుకుటం..ఒకే క్యాంపస్​లో రెండు  స్కూల్స్​, 3 జూనియర్, 2 డిగ్రీ కాలేజీలు
  • సరైన వసతులు లేక స్టూడెంట్స్​ తిప్పలు

మెదక్, కౌడిపల్లి, వెలుగు: జిల్లాలో గురుకుల  వ్యవస్థ ఇరుకుటంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల స్కూల్స్​, కాలేజ్​లు మంజూరు చేసింది కానీ వాటికి బిల్డింగ్ లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా స్కూల్స్, కాలేజీల నిర్వహణ ఇబ్బందికరంగా తయారైంది. వసతుల కొరత కారణంగా ఒక చోట మంజూరైన స్కూల్​, కాలేజీలు మరోచోట నిర్వహిస్తున్నారు. 

స్టూడెంట్స్​సంఖ్యకు అనుగుణంగా సరిపడ క్లాస్​రూమ్స్​, టాయిలెట్స్​ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌడిపల్లి మండలం తునికిలోని మహాత్మా జ్యోతి భాపూలే గురుకుల స్కూల్​ప్రాంగణంలో రెండు స్కూల్స్,  మూడు జూనియర్ కాలేజీలు, రెండు  డిగ్రీ కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఉమ్మడి మెదక్ జిల్లాకు మంజూరైన మత్స్యకారుల గురుకుల స్కూల్​ను నర్సాపూర్​ నియోజకవర్గ పరిధిలోని తునికిలో ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక అక్కడ జూనియర్​ కాలేజీ మంజూరైంది. రెండేళ్ల కిందట డిగ్రీకి అప్​గ్రేడ్​ అయింది. 

మండల కేంద్రమైన కౌడిపల్లిలో 2019లో మంజూరైన బీసీ గురుకుల స్కూల్​, జూనియర్​కాలేజ్​సైతం అక్కడ అకామిడేషన్​ దొరకలేదని తునికి ఎంజేబీపీ ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నారు. 2023లో హవేలీ ఘన్​పూర్​ మండలానికి మంజూరైన జూనియర్​ కాలేజ్​ను సైతం ఇక్కడే ఏర్పాటు చేశారు.  2023లో మెదక్ పట్టణంలో మంజూరైన బీసీ డిగ్రీ కాలేజీని సైతం వసతి దొరకలేదని తునికి ఎంజేబీపీ క్యాంపస్​లోనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్​700  మంది, ఇంటర్  400 మంది, డిగ్రీ 50 మంది కలిపి మొత్తం 1,150 మంది స్టూడెంట్స్​చదువుకుంటున్నారు. 

స్కూల్​ కు, హాస్టల్​కు వేర్వేరు బిల్డింగ్​లు ఉన్నప్పటికీ స్టూడెంట్స్​సంఖ్య ఎక్కువగా ఉండడంతో క్లాస్​రూమ్స్​నిర్వహణ, వసతికి, భోజనాలకు, స్నానాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానిక కాలేజీతోపాటు, ఇతర ప్రాంతాల్లో మంజూరైన కాలేజీలు సైతం ఇక్కడే కొనసాగిస్తుండడంతో సబ్జెక్టులు బోధించేందుకు సరిపడినంత మంది లెక్చరర్లు లేక బోధన కుంటుపడుతోంది. గురుకులాల్లో మెరుగైన విద్య అందుతుందని తమ పిల్లలను చేర్పిస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం స్కూల్స్​, కాలేజీలు మంజూరు చేసినప్పటికీ సరైన వసతి సదుపాయాలు కల్పించలేదని, కనీసం ఈ ప్రభుత్వమైన స్పందించి మెరుగైన వసతులు కల్పించి స్టూడెంట్స్​ ఇబ్బందులు దూరం చేయాలని  కోరుతున్నారు. 

టెన్షన్​తో అనారోగ్యానికి గురవుతున్నా

బిల్డింగ్స్​లేకపోవడంతో మెదక్, హవేలీ ఘన్​పూర్, కౌడిపల్లి డిగ్రీ, ఇంటర్మీడియట్, స్కూల్స్​ను తునికి క్యాంపస్​లో నిర్వహిస్తున్నారు.  సరైన వసతి లేక వీటి నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. వందల సంఖ్యలో స్టూడెంట్స్​ ఉండడం, రోజుకు వందకు పైగా ఫోన్​లు వస్తుండడంతో టెన్షన్ తో బీపీ ఎక్కువవుతోంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా వృత్తి ధర్మంగా పిల్లలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. శివప్రసాద్​, ప్రిన్సిపల్, తునికి ఎంజేబీపీ 

బిల్డింగ్స్ కొరత వాస్తవమే 

మెదక్ జిల్లాలో బీసీ గురుకుల స్కూల్స్​, కాలేజీలకు బిల్డింగ్స్ కొరతతో సమస్యగానే ఉంది. వసతి సదుపాయాలు లేక ఒకే దగ్గర నాలుగైదు స్కూల్​, కాలేజీలను నడపాల్సిన పరిస్థితి నెలకొంది. స్టూడెంట్స్​సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇబ్బందిగానే ఉంది. మెదక్ జిల్లాలో కొత్తగా నాలుగు బిల్డింగ్స్​అవసరం ఉన్నాయి. బిల్డింగ్స్​కోసం వెతుకుతున్నాం కానీ దొరకడం లేదు.  ప్రభాకర్​, రీజినల్​ కో ఆర్డినేటర్​