- బస్టాప్ పైభాగంలో నీటితో తడిసిన చల్లని తడకలు, గడ్డి
- సేద తీరే ప్రయాణికులపై చల్లనినీటితో స్ర్పింకర్లతో స్ర్పే
- ట్రైసిటీలో 8 ప్రాంతాల్లో ఏర్పాటు
- హనుమకొండ పబ్లిక్ గార్డెన్, మిషనరీ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభం
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో తొలిసారిగా గ్రేటర్ వరంగల్లో ప్రయాణికుల కోసం మిస్ట్ బస్టాప్లు ఏర్పాటు చేశారు. టెంపరేచర్లు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులకు మండుటెండల నుంచి ఉపశమనం కల్పించేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చల్లనినీటిని స్ర్పింకర్లతో స్ర్పే చేసేలా సరికొత్త ఆలోచన చేశారు. ఈ బస్టాప్లో చల్లగా ఉండడం వల్ల వివిధ పనులరిత్యా బయటకొచ్చే ప్రయాణికులు సేదతీరే అవకాశం ఉంది.
అహ్మదాబాద్ తరహాలోనే..
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఏటేటా టెంపరేచర్లు పెరిగి ప్రయాణికులు వడదెబ్బకు గురికావడంతో ఆ ప్రాంతంలో 15 మీటర్ల నుంచి 25 మీటర్ల పొడవైన మిస్ట్ బస్టాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవే పరిస్థితులు రాష్ట్రంలోనూ కనిపిస్తుండటంతో మొదట గ్రేటర్ వరంగల్ అధికారులు మిస్ట్ బస్టాప్లను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ సిటీలో ఉదయం 8 గంటలు దాటిందంటే జనాలు అడుగు బయటపెట్టాలంటే జంకుతున్నారు. ఈ క్రమంలోనే జీడబ్ల్యూఎంసీ అధికారులు రాష్ట్రంలో మొదటిసారి మిస్ట్ బస్టాప్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో దాదాపు 8 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
కూల్కూల్ గా మిస్ట్ బస్టాప్స్..
నగరాల్లో మాములుగా ఆర్టీసీ, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసే బస్టాప్లు పైకప్పు ఎండకాలంలో వేడిని గ్రహించడంతో ఆ ప్రాంతంలో ప్రయాణికులు నిమిషం పాటు ఉండలేని దుస్థితి ఉంది. అయితే మిస్ట్బస్టాప్ ల్లో పైకప్పు తడకలు, గడ్డితో ఏర్పాటు చేస్తారు. బస్టాప్ పైభాగంతో పాటు చుట్టూ పొగమంచు మాదిరి చల్లని నీటిని స్ప్రే చేసేలా స్ప్రింకర్లు అమర్చారు. వీటిలోనుంచి వచ్చే నీరు తడకలు, గడ్డిని తడుపుతాయి. దీంతో ఆ ప్రాంతమంతా చల్లగా మారుతుంది. ప్రయాణికులపై స్ర్పింకర్లతో నీటి తుంపరలు కురిపించడంతో ఎండాకాలం ఎఫెక్ట్ కనిపించదు. బయట ప్రాంతంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే మిస్ట్ బస్టాప్లో 5 నుంచి 7 టెంపరేచర్లు తగ్గి 38 డిగ్రీల వాతావరణం ఉంటుంది. దీంతో ప్రధానంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు మండే ఎండల నుంచి ఉపశమనం దక్కుతోంది.
సిటీలో మిస్ట్ బస్టాప్ల ప్రారంభం..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు మిస్ట్ బస్టాప్లను గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ స్పెషల్ ఆఫీసర్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్తో పాటు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ వద్ద వీటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ గ్రేటర్ సిటీలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో నగర ప్రజలకు వాటినుంచి ఉపశమనం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. మిస్ట్ బస్టాప్లో సేదతీరే వారికి బయటి కంటే టెంపరేచర్లు తక్కువగా ఉంటాయన్నారు. నగరంలో మరికొన్నిచోట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు.
