
డోపింగ్ టెస్టులో పట్టుబడి..21 నెలల నిషేధానికి గురైన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఎట్టకేలకు స్పందించింది. తన కెరీర్లో నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకోలేదని తెలిపింది. తనకు జిమ్నాస్ట్ మాత్రమే తెలుసని ..దేశానికి చెడ్డపేరు తీసుకొచ్చే పని ఎన్నడూ కూడా చేయనని వివరించింది. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తనపై 21 నెలలు నిషేధం విధించిందని దీపా కర్మాకర్ వెల్లడించింది. 2021 అక్టోబర్ లో తన శాంపిల్స్ తీసుకుని డోప్ టెస్టుకు పంపినట్లు తెలిపింది. ఈ శాంపిల్స్తో నిషేధిత ఉత్ర్పేరకం ఉండటంతో టెస్టులో పాజిటివ్ వచ్చిందని వివరించింది. అయితే ఆ పదార్థం తన శరీరంలోకి ఎలా వచ్చిందో తెలియదని చెప్పింది. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ సమాఖ్య త్వరగా నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం ఉందని తెలిపింది. అందుకే తనపై విధించిన నిషేధాన్ని అంగీకరిస్తున్నానని...ఈ వ్యవహారం సహృదయ వాతావరణంలో జరిగినందుకు సంతోషంగా ఉందని దీప ట్విట్టర్లో వివరించింది.
2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో దీపా కర్మాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్ గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్లో వాల్ట్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన దీపా కర్మాకర్ నాల్గవ స్థానంలో నిలిచింది. అయితే 2017లో కాలి గాయం వల్ల జిమ్నాస్టిక్స్కు దూరమైంది. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి కోలుకోలేదు. చివరి సారిగా 2019లో బాకులో జరిగిన ప్రపంచ కప్ ఈవెంట్లో పాల్గొంది. తాజాగా నిషేధంతో దీపా అపారటస్ వరల్డ్ కప్ సిరీస్తో పాటు కనీసం మూడు వరల్డ్కప్ సిరీస్లకు కూడా దీప దూరం కానుంది. అయితే సెప్టెంబర్ 23 నుంచి ఆంట్వెర్ప్లో జరగనున్న వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.