ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. రూ.7,032 కోట్లతో 58 పనులకు ప్రపోజల్స్

ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. రూ.7,032 కోట్లతో 58 పనులకు ప్రపోజల్స్
  • ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. రూ.7,032 కోట్లతో 58 పనులకు ప్రపోజల్స్​ 
  • నిధులిచ్చేందుకు సర్కారు సిద్ధం
  • అయినా బల్దియా నిర్లక్ష్యం
  • ట్రిపుల్​ ఐటీ, ఖాజాగూడ జంక్షన్ పనుల టెండర్లు పూర్తయినా నో అగ్రిమెంట్​ 
  • కేబీఆర్ పార్కు వద్ద పనులపై కోర్టు కేసులు
  • న్యాయపరంగా ముందుకు పోని జీహెచ్ఎంసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హెచ్-సిటీ (హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పనులను జీహెచ్ఎంసీలో కొందరు ఉన్నతాధికారులు లైట్​తీస్కుంటున్నారు.  6 నెలల క్రితం హెచ్ సిటీ పనులను సీఎం రేవంత్​రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. అయితే,ఈ పనులపై బల్దియా అధికారులు పెద్దగా ఫోకస్ పెట్టడంలేదు. నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ పనులు స్పీడప్ చేయడంతో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నది తెలియడం లేదు.

హెచ్​సిటీ కింద 58 పనులు చేయాలని ప్రపోజల్స్​పెట్టగా, ఇందులో మొదటి విడతలో16 పనులు చేపట్టాలని అనుకున్నా ఆ దిశగా పనులు చర్యలు తీసుకోలేదు. కొన్ని ప్రాజెక్టుల కోసం ఆస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభమైనా పూర్తి చేయలేకపోయారు. ఏకకాలంలో అటు ఆస్తుల సేకరణ, టెండర్‌‌‌‌ ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ.. బల్దియా అధికారుల వల్ల సాధ్యం కావడంలేదు. ముఖ్యంగా బల్దియా ఇంజినీరింగ్ విభాగంలో పెద్దగా అనుభవం ఉన్న అధికారులు లేకపోవడంతోనే ఆలస్యమవుతుందన్న చర్చ జరుగుతోంది. అనుభవనం ఉన్న వారు రిటైర్డ్ కావడంతో వారి స్థానంలో వచ్చిన వారు పనులు చేయలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది.

రూ.7032 కోట్లతో పనులు..
హెచ్ సిటీలో భాగంగా  రూ.7,032 కోట్లతో 58 పనులు చేసేందుకు ప్రపోజల్స్​రెడీ చేశారు. ఇందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్ లు, 4 ఆర్ యూబీలు, మరో 3 ఆర్​యూబీలు, 10 రోడ్డు వెడల్పు పనులున్నాయి.  ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, నిధులు ఎప్పుడు కావాలన్న ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇందులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ సహా ట్రిపుల్​ఐటీ, ఖాజాగూడ జంక్షన్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి టెండర్లు ఫైనలయ్యాయి.

కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు ఫ్లై ఓవర్లు, ఆరు అండర్ పాస్ల నిర్మాణం కోసం టెండర్లు పూర్తయి మూడు నెలలవుతోంది. మేఘా కంపెనీ ఈ టెండర్లను దక్కించుకుంది. కానీ, పార్కు దగ్గర ఈకో సెన్సిటివ్ జోన్ అంటూ మూడు కేసులు ఫైల్​కావడంతో పనులు జరగడంలేదు. ఈ కేసులకి సంబంధించి న్యాయపరంగా ముందుకు పోవాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు.

ఖాజాగూడ  జంక్షన్​వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ కి కూడా టెండర్లు పూర్తయ్యాయి. ఈ టెండర్లను కేఎన్ఆర్ సంస్థ దక్కించుకుంది. టెండర్లు జరిగి నెల కావస్తున్న కూడా కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేసుకోవడంలేదు. టెండర్లు జరిగిన వారంలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉన్నా బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. మిగతా పనులు కూడా వివిధ దశల్లోనే ఉన్నాయి. 

ప్రాజెక్ట్ విభాగం అధికారులు పట్టించుకోకనే..
జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగంలో ఓ ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయన్న చర్చ సాగుతోంది. ఈ ఈ విభాగానికి సంబంధించి చీఫ్ గా ఉన్న భాస్కర్ రెడ్డి కూడా జీహెచ్ఎంసీ ప్రాజెక్టులకి సంబంధించి పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు తెలంగాణ  పబ్లిక్ హెల్త్ ఇన్​చార్జీ ఈఎన్సీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించడంతో ఎక్కువ టైం పబ్లిక్​హెల్త్​కే కేటాయిస్తున్నారు. అది రాష్ట్ర స్థాయి పోస్టు కావడంతో ప్రయార్టీ ఎక్కువగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే హెచ్ సిటీ పనులు ఆలస్యమవుతున్నాయంటున్నారు. అక్కడ, ఇక్కడ రెండు పోస్టులకు ఆయన న్యాయం చేయలేకపోతున్నారని తెలుస్తోంది. సీఈ వద్ద నెలల తరబడి ఫైల్స్ కదలడం లేదని సొంత విభాగంలో కొందరు అధికారులు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టుకి సంబంధించి ప్రత్యేకంగా ఓ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే పనులు స్పీడప్ అవుతాయంటున్నారు.