- ఉగాది వరకు 3 నెలలు ఉత్సవాలు
వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు : జానపదుల జాతరగా ప్రసిద్ధి చెందిన హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారికి కొత్త వస్త్రాలంకరణ విఘ్నేశ్వర పూజ పుణ్యావచనం, ధ్వజారోహణం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, తీర్థ పర ప్రసాద వితరణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
జాతర 3 నెలల పాటు ఉగాది వరకు వైభవంగా జరుగుతుంది. ప్రధానంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు మల్లన్న జాతరకు పోటెత్తుతారు. వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మంగళవారం భక్తులు మల్లన్న పట్నాలు, బోనాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారుల భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నా.. కానీ భక్తులు ఇబ్బందుల తప్పడం లేదు. జాతరలో ఎక్కడా పడితే అక్కడ అపరిశుభ్రంగా కనిపిస్తుందని యాదాద్రి జిల్లాకు చెందిన భక్తులు తెలిపారు. జాతర మొదలైనా ఇంకా ఐమాస్ట్ లైట్లకు దిమ్మెలు పనుల నడుస్తున్నాయి.
