- పేరొచ్చే పనులకు కేటీఆర్..తిట్లొచ్చే వాటికి హరీశ్!
- అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్ల కేటీఆర్ హవా
- పాలన మారిపోగానే ముందటికి హరీశ్..!
- అసెంబ్లీ సెషన్లో కార్నర్ అయిన బావ.. ప్రేక్షక పాత్రలో బావమరిది
- నెగెటివ్ విషయాల్లో కావాలనే హరీశ్ను ముందుకు నెడుతున్నారన్న టాక్
బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాతి లీడర్ ఎవరని అడిగితే ఎవరైనా మరో ఆలోచన లేకుండా కేటీఆర్ అని చెప్పేస్తారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం చైర్లో కూర్చోలేదు గానీ, అన్ని డిపార్ట్మెంట్లనూ ఆయనే ఓ సీఎం లెక్క హ్యాండిల్ చేశారన్న వాదనలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు అధికారం పోయే సరికి కేటీఆర్ను సైలెంట్ చేసి.. హరీశ్ను ముందుకు తోశారన్న చర్చ జరుగుతున్నది. పేరొచ్చే పనుల్లో కేటీఆర్ను, తిట్లొచ్చే వాటికేమో హరీశ్రావును ముందుకు తెస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకు మొన్నటి అసెంబ్లీ సమావేశాలు, గతంలో ఉప ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతలను ఉదహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హరీశ్ ఒక్కరే బీఆర్ఎస్ తరఫున అన్నింటినీ హ్యాండిల్చేయాల్సి వచ్చింది.
పేరొచ్చే పనులకు కేటీఆర్ను, తిట్లొచ్చే వాటికేమో హరీశ్ రావును ముందుకు తెస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకు మొన్నటి అసెంబ్లీ సమావేశాలు, గతంలో ఉప ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతలను ఉదహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హరీశ్ ఒక్కరే బీఆర్ఎస్ తరఫున అన్నింటినీ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది.
పార్టీ ఫ్లోర్లీడర్గా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తానికి డుమ్మా కొట్టారు. కేటీఆర్ లీడ్ తీసుకుంటారేమోనని అంతా అనుకున్నా.. సెషన్ మొత్తంలో అప్పుడప్పుడు తప్ప ప్రేక్షక పాత్రకే ఆయన పరిమితమయ్యారు. సైలెంట్గా ఉండిపోయారు. ఫస్ట్ సెషన్లో ఫైనాన్స్, విద్యుత్ శాఖలపై వైట్పేపర్లు.. సెకండ్ సెషన్లో కీలక బిల్లులు, కులగణన తీర్మానం, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేది లేదన్న తీర్మానంతో పాటు ఇరిగేషన్ మీద వైట్పేపర్ రిలీజ్పైనా బీఆర్ఎస్ తరఫున హరీశ్రావు లీడ్ తీసుకునే పరిస్థితిని కల్పించారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నెగెటివ్ విషయాల్లో హరీశ్రావును ముందుకుతోస్తూ కేటీఆర్ను మాత్రం సేఫ్జోన్లో ఉంచేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లు ఉందని వారిలో చర్చ నడుస్తున్నది.
కార్నర్ హరీశ్!
బడ్జెట్ సెషన్లో అత్యంత హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్పేపరే. అంతకన్నా ముందే ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ దగ్గరికి ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడి పరిస్థితిని వాళ్లకూ తెలిసేలా చేసింది. బీఆర్ఎస్, బీజేపీ వాళ్లను పిలిచినా వెళ్లలేదు. ఆ తర్వాత ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవహారాలపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అధికారంలో ఉన్నన్ని రోజులు కాళేశ్వరాన్ని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్.. దీని మీద చర్చించేందుకైనా అసెంబ్లీకి వస్తారని కొందరు బీఆర్ఎస్ నేతలు భావించినా ఆయన రాలేదు. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు మాత్రం హాజరయ్యారు.
ALSO READ : కొత్తగూడెం అవిశ్వాసంపై ఉత్కంఠ
ఇటు మొన్నటిదాకా సభకు హాజరైన కేటీఆర్ కూడా.. ఇరిగేషన్ మీద వైట్పేపర్ ప్రవేశపెడుతున్న రోజునే కేసీఆర్ బర్త్ డే ఉత్సవాల పేరిట సభకు రాలేదు. దీంతో అక్కడ హరీశ్ రావే బీఆర్ఎస్ తరఫున అన్నీ తానై చూసుకోవాల్సి వచ్చింది. ఇరిగేషన్ తప్పులపై సభ్యులు ప్రశ్నిస్తున్న ప్రతిసారి హరీశ్రావు కార్నర్ అయ్యారు. ఇట్ల నెగెటివ్ అంశాల నుంచి కేసీఆర్, కేటీఆర్ దూరంగా ఉండడంతో.. అవన్నీ హరీశ్ రావు మీదికి వచ్చిపడ్డాయని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
నిర్మాణం వరకు ఉంచుకొని.. ప్రారంభోత్సవానికి దూరం పెట్టి..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్రావు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అయితే, తీరా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక.. ప్రారంభోత్సవానికి మాత్రం హరీశ్రావును కేసీఆర్ దూరం పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టు ఓపెనింగ్కు అట్ల చేసి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రాజెక్టుపై జరిగిన చర్చకు మాత్రం హరీశ్రావును ముందుకు తోశారన్న వ్యాఖ్యలు గులాబీ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో నిరసన తెలపాలన్న.. పోడియం వద్దకు వెళ్లాలన్నా.. హరీశ్రావే ముందుకు రావాల్సి వచ్చింది. వాకౌట్ విషయంలోనూ ఆయన లీడ్లోనే పార్టీ నేతలు నడిచారు.
ఓడిపోయే స్థానాలకు హరీశ్ ఇన్చార్జ్!
దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్స్లో ఆయా నియోజకవర్గాలకు హరీశ్ రావునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్చార్జ్గా నియమించారు. ఆయా ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే హరీశ్రావుకు ఆ బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. అయితే, ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం కేటీఆర్కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగిన బీఆర్ఎస్.. గెలుస్తామని ముందు నుంచీ ధీమాతోనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే అక్కడ కేటీఆర్కు బాధ్యతలిచ్చారని పలువురు నేతలు అంటున్నారు. అంటే గెలిస్తే క్రెడిట్ కేటీఆర్కు.. ఓడితే తిట్లు హరీశ్ రావుకు అన్నట్టుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే ధోరణితో ఉన్నారన్న చర్చ నడుస్తున్నది.