- 299 టీఎంసీలకు ఒప్పుకున్నదేగత కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్రావు
- ఆ కేటాయింపులనువ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం32 లేఖలు రాసింది
- అసెంబ్లీని ప్రభుత్వం భ్రష్టు పట్టించింది.. సగటున ఏడాదికి 20 రోజులే సభ నడిపింది
- సభను 15 రోజులు నడపాలి.. తమకూ మైక్ ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు సభలోనే సమాధానం చెప్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఆధారాలతో సహా కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపిస్తామని చెప్పారు. 299 టీఎంసీల కేటాయింపులను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున 32 లేఖలు రాశామని గుర్తు చేశారు. కృష్ణా జలాల పున:పంపిణీ చేపట్టాలంటూ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే కేంద్రానికి లేఖ రాశామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దానిని సాధించామని చెప్పారు. ఆదివారం అసెంబ్లీలోనిబీఆర్ఎస్ఎల్పీలో హరీశ్రావు మీడియాతో చిట్చాట్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు ప్రభుత్వం కుదించిందని విమర్శించారు. 45 టీఎంసీలు చాలు అని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ రాశారా? లేదా? అని ప్రశ్నించారు. ఆ లేఖపై సంతకం పెట్టారా? లేదా? అని అడిగారు.
డిఫెన్స్లో పడినప్పుడల్లా అసెంబ్లీని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే.. కేసీఆర్ కొట్లాడారని, దీంతో అసెంబ్లీలో చెంపలేసుకుని ప్రభుత్వం నిర్ణయం వెనక్కు తీసుకుంటూ తీర్మానం చేసిందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలతో ఏ జిల్లాను ఎండబెడతారని ప్రశ్నించారు. ఏడాది కిందట డీపీఆర్ వాపస్ వస్తే ఇప్పటివరకు ఎందుకు తిరిగి సమర్పించలేదని కేసీఆర్ ప్రశ్నించారని, దీనిపైనే అసెంబ్లీ పెడుతున్నారని చెప్పారు.
అసెంబ్లీని భ్రష్టు పట్టించిన్రు
అన్ని వ్యవస్థల్లాగే అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని హరీశ్రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీని నడిపేందుకు ప్రభుత్వం భయపడుతున్నదని అన్నారు. కేవలం ప్రతిపక్షంపై బురదజల్లేందుకే సమావేశాలు పెడుతున్నారు తప్ప.. ప్రజా సమస్యలు చర్చించేందుకు కాదని తెలిపారు. అంగబలం, మందబలంతో సభను నడుపుతున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నడపాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క అంశంపైనా చర్చ పెట్టకపోతే అసెంబ్లీని నడిపేది ఎందుకని ప్రశ్నించారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రిపేర్ అయ్యి రాలేదంటూ వాళ్లలాగా పారిపోబోమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తమకు కేవలం ఒక్కరికే స్పీకర్ మైక్ ఇస్తున్నారని, తమ సభ్యుల్లో మూడో వంతు కూడా లేని పార్టీలకు మాత్రం ఇద్దరు చొప్పున ఇస్తున్నారని ఆరోపించారు.
ఘోష్ కమిషన్ రిపోర్ట్పై మాట్లాడుతుంటే తనకు ఏడుగురు మంత్రులు అడ్డుపడ్డారని తెలిపారు. అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడపడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదటి టర్మ్లో ఏడాదికి 32 రోజులు అసెంబ్లీని నడిపామని, కాంగ్రెస్ రెండేండ్లలో సగటున 20 రోజులే నడిపిందని చెప్పారు. 2024లో 24 రోజులు, ఈ ఏడాది 16 రోజులు అసెంబ్లీ పెట్టిందని విమర్శించారు.
20 రోజులు కూడా అసెంబ్లీ నడపడం లేదు
ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు కనీసం 20 రోజులు కూడా పెట్టడం లేదని హరీశ్ అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోతే రెండ్రోజులు సంతాప తీర్మానాలు, మూడు శ్వేతపత్రాలు, కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్, బీసీ రిజర్వేషన్లపై మాత్రమే చర్చ పెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీహౌస్ కమిటీలు ఇప్పటివరకు వేయలేదని తెలిపారు. లోపం స్పీకర్ వద్ద ఉందా? లేకపోతే శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దగ్గర ఉన్నదా? అని ప్రశ్నించారు.
