ఢాకా: స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హంతకులు ఇద్దరు భారత్కు పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. సరిహద్దులు దాటి మేఘాలయలో చొరబడ్డారని వెల్లడించారు. ఢాకా మెట్రోపాలిటన్ అదనపు కమిషనర్ ఎస్ఎస్ నజ్రుల్ ఇస్లాం ఆదివారం మీడియాతో మాట్లాడారు. అనుమానితులు ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్.. మైమిన్ సింగ్లో స్థానికుల సహకారంతో బంగ్లాదేశ్ నుంచి భారత్కు పారిపోయారని చెప్పారు. బంగ్లాదేశ్లోని హలువాఘాట్ సరిహద్దులను దాటి మేఘాలయలో చొరబడ్డారని పేర్కొన్నారు.
‘‘బంగ్లా సరిహద్దులను దాటిన తర్వాత పుర్తి అనే వ్యక్తి ఫస్ట్ వారికి సాయం చేశాడు. తర్వాత సమి అనే ట్యాక్సీ డ్రైవర్.. ఫైసల్, ఆలంగిర్ను కారులో ఎక్కించుకుని మేఘాలయలోని తురా సిటీలో వదిలేశాడు. పుర్తి, సమిని ఇండియన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మాకు సమాచారం ఉంది” అని ఇస్లాం పేర్కొన్నారు. హాదీ హంతకులను అరెస్టు చేసి, తిరిగి బంగ్లాదేశ్కు అప్పగించే విషయంలో సహకరించాలని ఆయన కోరారు. ఈ విషయమై భారత అధికారులతో మాట్లాడుతున్నామని వెల్లడించారు.
బంగ్లా పోలీసుల వ్యాఖ్యల్లో నిజం లేదు: బీఎస్ఎఫ్
హాదీ హంతకులు ఫైసల్, ఆలంగిర్ భారత్లో చొరబడ్డారన్న బంగ్లాదేశ్ పోలీసుల వ్యాఖ్యలను మేఘాలయ, బీఎస్ఎఫ్ పోలీసులు తోసిపుచ్చారు. వారు భారత్లో చొరబడ్డారని చెప్పడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదని బీఎస్ఎఫ్ ఐజీ ఓపీ ఉపాధ్యాయ తెలిపారు.
