- కొత్తగా ఫోర్త్ సిటీ పోలీస్ కమిషనరేట్
- శంషాబాద్, రాజేంద్రనగర్హైదరాబాద్లోకి..
- రాచకొండకు మూడు, సైబరాబాద్కు మరో 3 జోన్ల కేటాయింపు
- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలోకి శివారు మున్సిపాలిటీల విలీనం తర్వాత మూడు పోలీస్కమిషనరేట్లలోని ప్రాంతాలను కూడా జోన్లకు అనుకూలంగా సర్దుబాటు చేయనున్నట్టు సమాచారం. ‘మహా’ బల్దియాలో 12 జోన్లను ఏర్పాటు చేయగా, వీటికి అనుగుణంగా మూడు పోలీస్కమిషనరేట్లలోని ప్రాంతాలను అడ్జస్ట్చేయబోతున్నట్టు తెలిసింది.
ఇందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్లోకి ఆరు జోన్లు, రాచకొండకు మూడు, సైబరాబాద్ పరిధిలోను మూడు జోన్లు ఉంటాయని అంటున్నారు. వీటితో పాటు ఫోర్త్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు ముమ్మురం చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిర్ణయం వెలువడుతుందంటున్నారు.
ఎలా ఉండబోతోందంటే..
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ తర్వాత 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వచ్చి చేరడంతో పరిధి విస్తృతంగా పెరిగింది. హైదరాబాద్కమిషనరేట్పరిధిలో ఇప్పటివరకు చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ప్రాంతాలు ఉండేవి. కానీ, ప్రస్తుతం సైబరాబాద్పరిధిలోని శంషాబాద్, రాజేంద్రనగర్జోన్లను హైదరాబాద్లో కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియా ముఖ్యమైన ప్రాంతం కావడంతో హైదరాబాద్కమిషనరేట్పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అలాగే, సైబరాబాద్పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ప్రాంతాలు.. రాచకొండ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్జోన్లను తీసుకురాబోతున్నట్ట చర్చ జరుగుతోంది.
ఫోర్త్ కమిషనరేట్ ఇలా..
రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరంలోని కొన్ని ప్రాంతాలు, షాద్నగర్, చేవెళ్లలో కొన్ని ప్రాంతాలను కలిపి ఫోర్త్సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు సర్కారు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులోనే శంషాబాద్ ప్రాంతాన్ని కలిపితే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు డీజీపీ ఆఫీసులో పోలీస్ ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్, ఉన్నతాధికారులు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మూడు కమిషనరేట్లలో రీ షఫ్లింగ్, కొత్త కమిషనరేట్ పరిధి, సిబ్బంది సంఖ్య, జోన్లు తదితర అంశాలపై ఈ మీటింగ్లో చర్చించారు. కొత్త ప్రతిపాదనలు అమలుకు సంబంధించిన జీవో మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి సైతం ఇకపై ప్రత్యేక పోలీస్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నుట్టు తెలిసింది.
