మోడల్ శీతల్ దారుణ హత్య.. గొంతు కోసి కాలువలో పడేసిన దుండగులు

మోడల్ శీతల్ దారుణ హత్య.. గొంతు కోసి కాలువలో పడేసిన దుండగులు

ఛండీఘర్: హర్యానాకు చెందిన మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శీతల్ దారుణ హత్యకు గురైంది. సోనిపట్‌లోని ఖార్ఖోడా ప్రాంతం ఖండా గ్రామానికి సమీపంలోని రిలయన్స్ కాలువ సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు దుండుగులు. శీతల్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం పానిపట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ క్రమంలో ఆదివారం (జూన్ 15) రాత్రి రిలయన్స్ కాలువ సమీపంలో పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం శీతల్ మృతదేహాన్ని సివిల్ ఆసుపత్రికి పంపారు. సోనిపట్ పోలీసులు హత్యపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయలేదని.. దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. శీతల్ ను దారుణంగా హతమార్చిన నిందితులను గుర్తించేందుకు గాలింపు మొదలుపెట్టామని చెప్పారు. 

సిమ్మీ అని పిలువబడే శీతల్ హర్యానాలోని పానిపట్‎కు చెందినది. మోడల్‎గా, ఇన్ప్లూయెన్సర్‎గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే అహర్ గ్రామంలో జరగాల్సిన హర్యాన్వి ఆల్బమ్ షూట్ కోసం ఇంటి నుంచి వెళ్లిన శీతల్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె సోదరి జూన్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. శీతల్ సోదరి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శీతల్ కోసం గాలింపు చేపట్టారు. శీతల్ చివరగా  సునీల్ అనే పురుష సహచరుడితో కలిసి కారులో బయలుదేరినట్లు గుర్తించారు. 

►ALSO READ | Viral Video: రూ.500 నోట్ల వర్షం కురిపించిన కోతి.. వైరల్ వీడియో, ఎక్కడంటే..?

వీరు ప్రయాణించిన కారు అనుమానాస్పద స్థితిలో కాలువలో పడిపోయినట్లు సమాచారం. సునీల్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించగా.. వాహనం వెలికితీసే క్రమంలో శీతల్ మృతదేహం బయటపడింది. ఈ కేసును సోనిపట్, పానిపట్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. శీతల్ శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని.. ఇది హత్య కేసుగా అనుమానిస్తున్నామని  డీఎస్పీ రాజ్‌బీర్ సింగ్ పేర్కొన్నారు. శీతల్ హత్యకు గురైందని, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోలేదని ఆమె కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.