
- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బిల్డింగ్ సెల్లార్లోకి వరదతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన ఘటనలో మున్సిపల్ అధికారులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)నుంచి ఒక్కరైనా అరెస్టయ్యారా? అని ప్రశ్నించింది. విద్యార్థుల మరణాలపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టింది.
ఉన్నతాధికారుల తీరును తప్పుపట్టింది. ఉచితాలను ప్రోత్సహిస్తూ.. ట్యాక్స్లు వసూలు చేయకుండా మల్టీస్టోర్ బిల్డింగ్స్కు అనుమతించి డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని వ్యాఖ్యానించింది. పట్టణ నిర్వహణ ప్రణాళికపై సమాధానమివ్వాలని ఎంసీడీ డైరెక్టర్కు సమన్లు జారీ చేసింది. మరోవైపు, నిర్లక్ష్యంగా కారు నడిపి.. కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు వచ్చేందుకు కారణమయ్యాడనే ఆరోపణలపై అరెస్టయిన ఎస్యూవీ డ్రైవర్ మనూజ్కథూరియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. కోచింగ్ సెంటర్ కోఓనర్స్కు కూడా కోర్టు బెయిల్ తిరస్కరించింది.