చైనా భారత భూ భాగాన్ని కబ్జా చేసేందుకు జరిపిన కుట్రలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. దీంతో భారత్ లో చైనా పై ఆగ్రహావేశాలు రగిలిపోతున్నాయి. మన 20మంది సైనికుల వీరమరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఒక్కో తలకు 18తలలు తెగిపడాలి అంటూ మండిపడుతున్నారు.
భారత – చైనా సరిహద్దు విధి నిర్వహణలో హవల్దార్ అమన్ కుమార్ సింగ్ వీరమరణం పొందారు. బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలోని మొహియుద్దీన్ నగర్లోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన అమన్ కుమార్ సింగ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు.
అయితే అమన్ వీరమరణంపై ఆయన తండ్రి సుధీర్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. తన కుమారుడు అమన్ 2014 ,16 బీహార్ ఆర్మీ రెజిమెంట్ లో చేరినట్లు తెలిపారు. అమన్ ఫిబ్రవరి 2019 లో వివాహం చేసుకున్నట్లు తెలిపిన సుధీర్ కుమార్ సింగ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లేహ్ – లడఖ్ ప్రాంతంలో పోస్టింగ్ పడినట్లు చెప్పారు. తన కొత్త పోస్టింగ్ లో చేరేందుకు ముందు అమన్ ఎనిమిది రోజులు ఇంటికి వచ్చినట్లు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా అమన్ తండ్రి సుధీర్ కుమార్ సింగ్ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయాడని ఆర్మీ అధికారులు చెప్పారు. అయినా నా కొడుకు చనిపోయినందుకు నేను బాధపడడంలేదు. దేశం కోసం ప్రాణాలిచ్చినందుకు గర్వంగా ఉంది. కానీ చైనా పై కోపంగా ఉంది. నా చిన్నకొడుకును ఆర్మీలోకి పంపుతా. ఒక్కో తలకు 18తలలు తెగిపడాలి అంటూ గర్వంగా చెప్పారు.