కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు కేటాయించిన నిధులపై విమర్శలు వస్తున్నాయని, ఎంత మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టినా విమర్శలు సహజమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణ గా మార్చాడని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు అవుతున్న పథకాలకు మోడి ఫోటో కూడా పెట్టడం లేదని, కేంద్ర పథకాలనే పేరు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు.
బడ్జెట్ పై టీఆర్ఎస్ విమర్శలు చేయలేదని.. హరీష్ రావు, కేసీఆర్ లు ఏమీ మాట్లాడలేదంటే.. వాళ్ళు కేంద్ర బడ్జెట్ పై సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నానన్నారు సంజయ్. కొన్ని రాష్ట్రాలలో ఓట్ల కోసం , తిరిగి అధికారంలోకి రావడానికి సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ని పట్టించుకోవడం లేదని , తెలంగాణ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ మాత్రమేనన్నారు. భవిష్యత్ తెలంగాణ కోసం, శక్తి వంతమైన తెలంగాణ కోసం, అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ముందుకు వెళ్తోందని సంజయ్ ఈ సందర్భంగా అన్నారు.