ఆ ఊళ్లో బడికి వెళ్లే పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ కొవిడ్ కాలం కదా! బడులు బంద్ అయ్యాయి. ఆ పిల్లలంతా చదువుకు దూరం అయ్యారు. ఆన్లైన్ క్లాసులు జరిగాయి. కానీ, అవన్నీ గిరిజనుల కుటుంబాలు. సరైన టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం వల్ల వాటికీ అటెండ్ కాలేదు. దీంతో చొరవ తీసుకున్న టీచర్ దీప్ నాయక్ బడినే వాళ్ల దగ్గరకు తెచ్చాడు. వెస్ట్ బెంగాల్ లోని వర్ధమాన్ జిల్లాలో జోబా అత్పారా అనే ఊరు. అక్కడ గిరిజనులు ఉంటారు. కోవిడ్ వల్ల పిల్లలంతా ఇంటి దగ్గరే ఉండటాన్ని గమనించాడు. ఆన్లైన్ క్లాస్లకు వెళ్లకపోవడాన్ని చూశాడు. దీంతో ఆ ఊరి వీధులనే క్లాస్ రూమ్లుగా, గోడలనే బ్లాక్ బోర్డులుగా మార్చేశాడు. ఏడాది కాలంగా ఆ వీధుల్లోనే పిల్లలకు చదువు చెబుతున్నాడు.
దగ్గర్లోని స్కూళ్ల నుంచి ఎక్విప్మెంట్ తెచ్చి పిల్లలకు ఇస్తున్నాడు. ఆ ఊరికి చెందిన పిల్లలు ఎవరూ చదువుకు దూరం కావొద్దనేది దీప్ సింగ్ ఆలోచన. ఇలా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పిల్లలందర్నీ చేరదీశాడు. రైమ్స్, ఎక్కాలు, సైన్స్ పాఠాలు అన్నీ ఒక్కడే అందరికీ చెబుతున్నాడు. ‘ఈ స్టూడెంట్లు అంతా కూలీల పిల్లలు. వీళ్లకు చదువు అందకపోతే ఎంతో నష్టపోతారు. అందుకే ఈ ఫస్ట్ జనరేషన్ పిల్లలకి చదువు అందించాలని స్ట్రీట్ స్కూల్ నడుపుతున్నాను’ అని చెప్పాడు దీప్ నాయక్.