పట్టాలపై పరిగెత్తి ప్రాణం కాపాడారు

పట్టాలపై పరిగెత్తి ప్రాణం కాపాడారు

మంచిర్యాల, వెలుగు: రైల్వే ట్రాక్​పై ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. మంచిర్యాల జిల్లా రాజీవ్​నగర్​కు చెందిన వేముల లక్ష్మీనారాయణ(42) కుటుంబ కలహాలతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం సాయంత్రం  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. రైల్వే ట్రాక్​పై ఉన్న లక్ష్మీనారాయణను అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి 100కు డయల్​ చేసి సమాచారం ఇచ్చాడు. స్పందించిన మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై ప్రవీణ్​ కుమార్​ ఫోన్​కాల్​ లొకేషన్​ఆధారంగా సుమారు రెండు కి.మీ. మేర పట్టాలపై పరిగెత్తి ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తి వద్దకు చేరుకున్నారు. ఆ వ్యక్తి బాగా తాగి ఉండటంతో పోలీసులతో రావడానికి నిరాకరించాడు. అక్కడికి వెహికల్ ​తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో సీఐ గన్​మన్​  భరత్​ సుమారు రెండు కి.మీ. వరకు ఆ వ్యక్తిని భుజాలపై మోసుకొని పట్టాలపై నడుచుకుంటూ తీసుకువచ్చాడు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్​ ఇచ్చి ఆసుపత్రిలో చేర్పించారు.