విడతలవారీ రుణమాఫీతో అప్పులపాలు : జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు : రైతులకు కేసీఆర్సర్కారు చేసిందేమీ లేదని, పది రూపాయలిచ్చి 90 ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జగ్గారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ ఏకకాలంలో కాకుండా విడతలవారీగా చేయడంతో రైతులు వడ్డీల మీద వడ్డీలు కట్టలేక అప్పులపాలయ్యారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు. చారానా ఇచ్చి బారానా ఇచ్చినట్టు చెప్పుకోవడం టీఆర్ఎస్కు అలవాటైపోయిందన్నారు. కేసీఆర్ వచ్చాకే రైతులు తిండితింటున్నట్టు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ వ్యవసాయానికి పెద్ద పీట వేసిందన్నారు. రైతులకు తామేం చేశామో, అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నామో రాహుల్ సభలో ప్రకటిస్తామని చెప్పారు.