నిజామాబాద్ జిల్లా ఘన్పూర్లో మోసపోయిన మహిళ
బయటపడిన కొత్త రకం మోసం
డిచ్పల్లి, వెలుగు : ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు సరికొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఫోన్చేసి ఓటీపీలతో ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేసిన క్రిమినల్స్ ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చి ఓటీపీలు అడిగే స్థాయికి ఎదిగారు. ఇలాంటి ఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘన్పూర్లో జరిగింది. గ్రామానికి చెందిన చైతన్య గృహిణి. ఆమె భర్త ఉపాధి కోసం గల్ఫ్వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై ఇంటికి వచ్చాడు. ఆఫర్లో గిఫ్ట్ వచ్చిందని స్కూటీ, ఫ్రిడ్జ్, బంగారంలలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని చైతన్యను నమ్మించాడు.
ఫోన్కి ఓటీపీ వస్తుందని అది చెప్తే గిఫ్ట్ ఇచ్చి వెళ్తానని చెప్పాడు. ఆమె ఫోన్లేదని చెప్పడంతో ష్యూరిటీగా ఆమె వద్ద ఏమైనా బంగారం రసీదులు ఉంటే ఇవ్వాలని కోరారు. రసీదులు కూడా లేవని చెప్పడంతో తనకు తెలిసిన గోల్డ్షాప్లో ఇప్పిస్తానని చెప్పాడు. నిజమేనని నమ్మిన ఆమె తులంన్నర ఉన్న రెండు ఉంగరాలు, కమ్మలు ఇచ్చి అతడితో బైక్పై వెళ్లింది. మార్గమధ్యలో తన ఇంట్లోకి వెళ్లొస్తానని చెప్పిన సదరు వ్యక్తి బంగారంతో ఉడాయించాడు. మోసపోయానని గుర్తించిన మహిళ డిచ్పల్లి పీఎస్లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.