
లీస్టర్: ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్కు రెడీ అవుతున్న ఇండియా టెస్టు టీమ్తో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కలిశాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగించుకొని ఇంగ్లండ్ వెళ్లిన ద్రవిడ్ మంగళవారం టీమ్ ప్రాక్టీస్ చేస్తున్న లీస్టర్షైర్ కౌంటీ గ్రాండ్కు వచ్చాడు. ప్లేయర్లందరితో మాట్లాడి ప్రాక్టీస్ను పర్యవేక్షించాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఆడిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కూడా టీమ్లో చేరారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా ఈనెల 24–27 మధ్య లీస్టర్షైర్తో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్తో తమ తుదిజట్టుపై అంచనాకు రావాలని కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ భావిస్తున్నారు. జులై 1–5 మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇండియా–ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుంది. గతేడాది ఐదు టెస్టుల సిరీస్లో వాయిదా పడ్డ ఆఖరి మ్యాచ్ ఇది.
రోహిత్, కోహ్లీపై బోర్డు ఆగ్రహం
కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ.. మాస్క్లు లేకుండా లండన్లో షాపింగ్ చేయడంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మాస్క్లు ధరించకుండా ఫ్యాన్స్ను కలవకూడదని హెచ్చరించనుంది. మరోవైపు ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఎంపికైన ఇండియా టీమ్ ఈ నెల 23 లేదా 24న డబ్లిన్ బయలుదేరనుంది. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్.. టీమ్తో పాటు బయలుదేరనున్నాడు.