- సింగిల్ జడ్జి తీర్పుపై స్టే పొడిగించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీ తదితరులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను హైకోర్టు డిసెంబరు 22వ తేదీకి వాయిదా వేసింది. ఇందులో ప్రతివాదులైన పిటిషనర్లు రాతపూర్వక వాదనలు సోమవారం సాయంత్రం సమర్పించడంతో అడ్వకేట్ జనరల్ వాయిదా కోరగా విచారణను వాయిదా వేసింది.
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను మోడరేషన్ పద్ధతిలో పునర్మూల్యాంకనం చేపట్టి వచ్చిన ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని లేదంటే తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతోపాటు మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
గత ఆదేశాల మేరకు పిటిషనర్లు రాతపూర్వక వాదనలను సోమవారం సమర్పించడంతో విచారణను వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఇకపై రాతపూర్వక వాదనలు సమర్పించడానికి అవకాశం లేదని, మరోసారి ఎవరూ వాయిదా కోరడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
