మహారాష్ట్రను ముంచెత్తిన వాన

మహారాష్ట్రను ముంచెత్తిన వాన
  • లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం
  • ముంబైలో బిల్డింగ్​ కూలి మహిళ మృతి

ముంబై : మహారాష్ట్రను వానలు ముంచెత్తాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు నాగ్​పూర్, చంద్రాపూర్​, అమరావతి, వార్దా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో భీవండి ప్రాంతంలో జనజీవనం అతలాకూతలం అయ్యింది. గడ్చిరోలిలోని కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరదల కారణంగా అల్లపల్లి భామ్రాగఢ్ నేషనల్​హైవే సహా 8 రోడ్లను మూసేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. నగరంలోని రోడ్లు, రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై నీరు నిలిచి, సబర్బన్ రైలు సర్వీసులు 15 – 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. హార్బర్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చునాభట్టి వద్ద ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై నీరు చేరడంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నీరు చేరడంతో అంధేరి సబ్​వేను కొద్దిసేపు మూసివేశారు.

నీటిని బయటకు పంపించి, సేవలను పునరుద్ధరించారు. థానే జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. థానే వందన బస్ డిపో, స్థానిక మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీరు చేరడంతో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముంబై, పాల్ఘర్​కు ఎల్లో అలర్ట్​, థానే జిల్లాకు ఆరెంజ్​ అలర్ట్​ జారీచేశారు.

ముంబైలో బిల్డింగ్​ కూలి మహిళ మృతి.. 

ముంబైలో విషాదం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఓ బిల్డింగ్​ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. గ్రాంట్​రోడ్​ రైల్వే స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల పాత భవనంలో కొంతభాగం కూలిపోగా.. మరికొంత భాగం వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. ఆ సమయంలో ఇంట్లో 30-40 మంది ఉన్నారు. మహిళ మృతదేహాన్ని  ఫైర్, పోలీస్​ అధికారులు శిథిలాల నుంచి వెలికి తీశారు. 

ఒడిశాలోనూ భారీ వానలు

ఒడిశాలోనూ శనివారం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చిలికా సరస్సు సమీపంలో తీరం దాటడంతో వానలు దంచికొట్టాయని అధికారులు తెలిపారు. మల్కాన్​గిరి జిల్లాలో 23 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. 

నాగ్​పూర్​లో స్కూళ్లకు సెలవులు

నాగ్​పూర్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం 135.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయ్యాయి. భారీ వర్ష సూచనలతో నాగ్​పూర్​లోని స్కూళ్లకు కలెక్టర్​ సెలవులు ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హుద్కేశ్వర్​ నగర్​ఏరియాలో వరదలో చిక్కుకున్న 50 మంది అంటాలికా కాలేజీ విద్యార్థులను అధికారులు  రక్షించారు.