నడి వేసవిలో అకాల వర్షాలు... రైతన్నల గగ్గోలు

నడి వేసవిలో అకాల వర్షాలు... రైతన్నల గగ్గోలు

ప్రజల ఆలోచనలతో పాటు కాల గమనం కూడా మారుతుందా... ఈ సారి ఎండాకాలం ఎండలు మండిపోతాయని గతంలో వాతావరణశాఖ భారీగా హెచ్చరికలు జారీ చేసింది.  మరి ఏమైందో తెలియదు కాని ... నెలలు నిండకుండా బిడ్డ పుట్టిన విధంగా.. ఈసారి వరుణ దేవుడు ముందే జనాలను పలకరిస్తున్నాడు. దీంతో చేతికొచ్చిన పంటలు కాస్తా నీటిమయం కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.  భారీ వర్షాలకు  మామిడికాయలు దెబ్పతింటున్నాయి. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే రైతులను ప్రభుత్వాలు పట్టించుకోక.. దిచ్చుతోచని పరిస్థితిలో ప్రకృతి ఆగ్రహించడంతో గగ్గోలు పెడుతున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా నడివేసవిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ఫలితంగా పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. కాగా..  రానున్న ఐదురోజుల్లో దేశంలో వాతావరణం ఇలా ఉండబోతుందని పేర్కొంటూ ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో కూడిన దక్షిణ భారత్ లో వచ్చే ఐదే రోజుల పాటు భారీ నుంచి, అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో వారంరోజుల వరకూ భారీ వర్షాలుంటాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు కూడా పడొచ్చని హెచ్చరించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో వడగండ్ల వానలు పడతాయని ప్రకటించింది. కేథార్ నాథ్ లో ఇప్పటికే మంచు వర్షం కురుస్తుండటంతో యాత్రికులను హెచ్చరించింది. వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగానే ఈ అకాల వర్షాలు కురుస్తున్నట్లు ఐఎండీ వివరించింది. హర్యానా, పరిసర ప్రాంతాల్లో దిగువ నుంచి ఎగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలపై సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడినట్టు తెలిపింది. మరో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కూడా దక్షిణ పాకిస్థాన్ మధ్య ట్రోపోస్ఫెరిక్ స్థాయిల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. రానున్న ఐదురోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని, వడగాల్పులకు ఆస్కారం లేదని ఐఎండీ వివరించింది.