- రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్
- జగిత్యాల జిల్లా మల్లాపూర్లో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మరికొన్ని రోజులు టెంపరేచర్లు ఇదే స్థా యిలో ఉంటాయని హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ.. పలు చోట్ల రానున్న నాలుగు రోజులపాటు వానలు పడ్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుందని మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాతి మూడు రోజులు దాదాపు అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.
సిటీలో 40డిగ్రీలు దాటిన టెంపరేచర్
రాష్ట్రమంతటా టెంపరేచర్లు 40 డిగ్రీలకుపైనే నమోదయ్యాయి. నిన్నమొన్నటి దాకా పలుచోట్ల 40 డిగ్రీల్లోపే ఉండగా.. ఇప్పుడు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఆ మార్క్ను దాటేసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నిన్నటిదాకా హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40లోపే ఉండగా.. తాజాగా షేక్పేటలో అత్యధికంగా 41.5 డిగ్రీలు రికార్డైంది.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో 44.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్లో 44.6 డిగ్రీలు, రాఘవపేటలో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, జైనథ్లో 44.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 44.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.