- చాలా జిల్లాల్లో భారీ వర్షాలు
- రంగారెడ్డి జిల్లా సంగంలో 16 సెంటీమీటర్ల వాన
హైదరాబాద్, మహబూబ్నగర్/ నాగర్ కర్నూల్ వెలుగు: రాష్ట్రంలో వాన కుమ్మేసింది. చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులు, గాలులతో వానలు దంచికొట్టాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వర్షాల జోరు పెరిగింది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టీఎస్డీపీఎప్ డేటా ప్రకారం మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు రంగారెడ్డి జిల్లాలోని సంగంలో 16 సెంటీమీటర్లు, మహబూబ్నగర్లోని ఉడిత్యాల్లో 15.6, నాగర్కర్నూల్లోని తోటపల్లిలో 13.6, ఆమన్గల్లో 12.6, వనపర్తిలో 12.5, నల్గొండలోని డిండిలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గురువారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్లలో భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.
ఉమ్మడి పాలమూరులో భారీ వర్షం
మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగాయి. దుందుభి వాగు పారింది. పాలమూరు పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పెద్దవాగు పొంగడంతో సూరారం–-ఉడిత్యాల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోతిఘన్పూర్ సమీపంలో పాటు కాల్వల నుంచి వచ్చిన నీరు కల్వర్టు ఎక్కి పారాయి. దీంతో ఉదయం 5 గంటలకు జడ్చర్ల నుంచి షాద్నగర్కు వెళ్తున్న కారు కొట్టుకుపోయింది. ఓ చెట్టును తాకి అక్కడే ఆగడంతో, అందులో ఇద్దరు కారు తలుపులు తీసుకొని బయటపడ్డారు. జడ్చర్లలో కొన్ని కాలనీల్లోకి నీళ్లు చేరాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని పలు స్కూళ్లు చెరువుల్లా మారాయి.
