కాంగ్రెస్​లో ముదురుతున్న లొల్లి

కాంగ్రెస్​లో ముదురుతున్న లొల్లి
  • డీసీసీ చీఫ్​లను పట్టించుకోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్​చార్జులు
  • మున్సి‘పోల్’ సన్నాహక మీటింగ్స్​లో బయటపడుతున్న విభేదాలు
  • పీసీసీకి ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్​లో నేతల మధ్య ఆధిపత్య పోరు, కలహాలు మరింత ముదురుతున్నాయి. నేతలంతా కలసికట్టుగా మున్సిపల్​ ఎలక్షన్ల కోసం వ్యూహ రచన చేయాల్సిన సమావేశాల్లోనే తమ మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టుకుంటున్నారు. పీసీసీ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలు రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాయి. మున్సిపల్​ఎలక్షన్లలో గెలుపే లక్ష్యంగా నిర్వహించుకున్న ఈ మీటింగ్ లలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్​చార్జులు ఎవరికి వారే తమ పెత్తనం చాటుకునేందుకు ప్రయత్నించడంతో వివాదాలు రేకెత్తాయి.

చాలా జిల్లాల్లో అదే పరిస్థితి

ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి మాజీ ఎంపీ, కరీంనగర్​ లోక్​సభ సెగ్మెంట్ ఇన్ చార్జి పొన్నం ప్రభాకర్ రాలేదు. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర నేతలు వచ్చారు. ఈ జిల్లాలో పొన్నంకు, డీసీసీ అధ్యక్షుడికి మధ్య సఖ్యత లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మృత్యుంజయం ఒకటిగా, పొన్నం, కరీంనగర్​ సిటీ ప్రెసిడెంట్​ రాజశేఖర్​ మరో గ్రూప్ గా ఉన్నారని అంటున్నారు.

  • పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు పెత్తనం చలాయిస్తున్నారని, అది డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొంరయ్యకు రుచించడం లేదని ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్​చార్జి విజయరమణారావు, రామగుండం మున్సిపాలిటీ పరిధిలో పార్టీలో కీలకంగా వ్యవహరించే రాజ్ ఠాకూర్ లతోనూ డీసీసీ చీఫ్​కు విభేదాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ ఇద్దరు నేతలు నేరుగా శ్రీధర్​బాబుతో మాట్లాడి పార్టీ పరమైన పనులు చేసుకుంటారని అంటున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన డీసీసీ సమావేశంలో డీసీసీ చీఫ్​ పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించారని, దాంతో శ్రీధర్​బాబు కొంత నొచ్చుకున్నారని చెబుతున్నారు. మున్సిపల్​ ఎలక్షన్ల నాటికి ఈ విభేదాలు భగ్గుమనే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  • జగిత్యాల జిల్లా డీసీసీ చీఫ్​ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొంరెడ్డి రాములుకు మధ్య సఖ్యత లేదని.. అటు లోక్​సభ సెగ్మెంట్​ ఇన్​చార్జి మధుయాష్కీతోనూ రాములుకు విభేధాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
  • ఆదిలాబాద్ డీసీసీ చీఫ్​ భార్గవ్ దేశ్ పాండేతో అక్కడి సీనియర్ నేతలు రాంచంద్రారెడ్డికి, గండ్రత్ సుజాతకు పొసగడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరు డీసీసీ చీఫ్​కు చెప్పకుండానే.. తమ అనుచరులకు పదవులు, పనులు చేసిపెడతారని అంటున్నారు.
  • ఖమ్మంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి, అక్కడి డీసీసీ చీఫ్​ దుర్గా ప్రసాద్ కు పడటం లేదని.. డీసీసీ చీఫ్ ను రేణుక పట్టించుకోరని పార్టీ వర్గాలు అంటున్నాయి.
  •  మహబూబ్ నగర్ లో డీసీసీ చీఫ్​ ఉబేదుల్లా కొత్వాల్ తో ఆ జిల్లా సీనియర్లు మల్లు రవి, సురేందర్ రెడ్డి, ఇబ్రహీం, మధుసూదన్ రెడ్డిలకు ఏమాత్రం పొసగదని పార్టీలో చర్చ సాగుతోంది.