నా కోడికి విషం పెట్టి చంపేశారు..పోస్టుమార్టం చేయించండి

నా కోడికి విషం పెట్టి చంపేశారు..పోస్టుమార్టం చేయించండి
  • పోలీసులకు మాజీ ఎమ్మెల్యే తనయుడి ఫిర్యాదు 

మహారాజ్‌గంజ్‌: 'నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారు.. పోస్టుమార్టం చేయించి నిందితుడ్ని పట్టుకోండి '... అంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.  సినిమాల్లో ఈ తరహా సన్నివేశాలు చూస్తుంటాం.. కానీ నిజంగానే పోలీసు అధికారులకు ఎదురైందీ ఘటన. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  మహారాజ్‌గంజ్‌ జిల్లా సింధూరియన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో శనివారం ఈ ఫిర్యాదు అందింది. చేసింది కూడా మామూలు వ్యక్తి కాదు.. స్వయానా మాజీ ఎమ్మెల్యేకు తనయుడు కావడంతో పోలీసులకు ఫిర్యాదు తీసుకోవాల్సి వచ్చింది. 
సింధూరియన్ పోలీసు స్టేషన్ పరిధిలోని పిప్ర కళ్యాణ్‌ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్‌ కుమారుడు రాజ్‌కుమార్‌ భారతి నివసిస్తుంటారు. శనివారం ఆయన సింధూరియన్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తన కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారని.. చనిపోయిన కోడికి పోస్టుమార్టం చేయాలని డిమాండ్‌ చేశారు. నిందుతుడ్ని పట్టుకునేందుకు పోస్టుమార్టం ఉపయోగపడుతుందని వాదించడంతో ఫిర్యాదు విన్న అక్కడివారంతా అవాక్కయ్యారు.

బాధితుడైన మాజీ ఎమ్మెల్యే తనయుడు రాజ్‌ కుమార్‌ భారతి మాట్లాడుతూ... తనకు చిలుకలు, పావురాలు, కోళ్లు వంటివాటిని పెంచడం చాలా సరదా అని.. అయితే ఎవరో కిట్టనివారు కోడికి విషం పెట్టి చంపేసినట్లు అనుమానం కలుగుతోందని తెలిపారు. ఫిర్యాదు చేసింది మాజీ ఎమ్మెల్యే తనయుడు కావడంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.