అధికార గడపలో అక్షర దోషం!? ఒక ‘Not’తో తలకిందులైన జీవితం

అధికార గడపలో అక్షర దోషం!? ఒక ‘Not’తో తలకిందులైన జీవితం

ప్రపంచవ్యాప్తంగా చట్టాన్ని అమలు చేసే సంస్థలు పారదర్శకత వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, రక్షక భటులే భక్షకులుగా మారుతున్న ఘటనలు ప్రజాస్వామ్యానికి శాపంగా మారుతున్నాయి. ‘వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ నివేదిక ప్రకారం..  ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక హక్కుల పరిరక్షణలో అనేక దేశాలు వెనుకబడుతున్నాయి. పోలీస్ వ్యవస్థపై  ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ‘చిన్న అక్షరం’తో  చేసే పెద్ద మోసాలు దెబ్బతీస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్  షాజహాన్‌పూర్‌లో చేసిన ‘గోల్‌మాల్’ ఇందుకు  ప్రత్యక్ష నిదర్శనం. ఒక యువ జంట  ప్రేమ వివాహం చేసుకుంటే, వారికి రక్షణ కల్పించాల్సిన అధికారి,  కేవలం ఒక పదాన్ని మార్చడం ద్వారా ఒక వ్యక్తి జీవితాన్ని జైలుపాలు చేయడం అక్షరాలా నేరం.  ఇది కేవలం అధికారి వ్యక్తిగత తప్పిదమా లేక  వ్యవస్థలో  పేరుకుపోయిన ఏకపక్ష  ధోరణికి ప్రతిబింబమా? అనే ప్రశ్న నేడు ఉదయిస్తోంది. 

ఒక ‘Not’తో తలకిందులైన జీవితం
20 ఏళ్ల యువతి,  యువకుడు  ఇద్దరూ మేజర్లు కాబట్టి  చట్టపరంగా వారి  నిర్ణయానికి  విలువ ఉండాలి.  యువతి తన స్వచ్ఛంద  నిర్ణయం ప్రకారమే  ప్రియుడితో  వెళ్లానని  ‘I did go of my own will’ అని  రాసి ఇచ్చిన వాంగ్మూలాన్ని,  ఎస్సై తన  స్వలాభం కోసమో లేదా ఒత్తిడి కోసమో  ‘I did not go of my own will’ అని  మార్చడం  అత్యంత  హేయమైన చర్య. 

ప్రియురాలి  ఫిర్యాదుతో  కోర్టు  కల్పించుకోకపోయి ఉంటే, ఒక నిర్దోషి  జైలులోనే  మగ్గిపోయేవాడు. అయితే,  నేటి డిజిటల్ యుగంలో ప్రతి వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేయాలన్న నిబంధన ఆ యువకుడికి శ్రీరామ రక్షగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు  వీడియోను  పరిశీలించిన ప్రభుత్వం,  నిందితుడైన ఎస్సైను  సస్పెండ్  చేయడమే  కాకుండా  శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.  సాక్ష్యాధారాలను తారుమారు చేయడం అనేది ‘ఐపీసీ’ సెక్షన్ 218 కింద  తీవ్రమైన నేరమని ఈ ఘటన  మరోసారి గుర్తుచేస్తోంది.

వ్యవస్థలో  నైతిక సంక్షోభం
న్యాయశాస్త్రంలో  రెండు వైపుల వాదనా వినాలి అనే సూత్రం ఉంటుంది. అయితే, ఇక్కడ  పోలీస్ అధికారే వాస్తవాన్ని వక్రీకరించడం వల్ల బాధితుడి పక్షం పూర్తిగా బలహీనపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, చట్టాన్ని గౌరవించాల్సినవారే ఇలాంటి చర్యలకు పాల్పడితే సామాన్యుడికి దిక్కెవరు ? ప్రభుత్వం అతడిని సస్పెండ్  చేయడం తక్షణ ఉపశమనమే అయినప్పటికీ,  ఇలాంటి  ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే అసలైన పరిష్కారం. 

అంతర్జాతీయ స్థాయిలో  హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి  సంస్థలు  పదేపదే  హెచ్చరిస్తున్నట్లుగా,  పోలీస్ స్టేషన్లలో  సీసీటీవీ  కెమెరాలు,  డిజిటల్  సాక్ష్యాల  సేకరణను  పకడ్బందీగా అమలు చేయకపోతే  ‘ఖాకీ’ ముసుగులో  ఇలాంటి  అరాచకాలు  సాగుతూనే ఉంటాయి.  చట్టం ముందు అందరూ సమానులే  అనే  రాజ్యాంగ హామీని  నిలబెట్టడానికి  ఇలాంటి  అధికారులపై  కఠినమైన చర్యలు తీసుకోవడం  అత్యంత అవసరం.

అక్షరం ఆయుధమైతేనే న్యాయం సుస్థిరం
చరిత్రను  గమనిస్తే,  తప్పుడు  సాక్ష్యాలతో  నిర్దోషులను శిక్షించిన వ్యవస్థలు  కాలక్రమేణా  పతనమయ్యాయి.  షాజహాన్‌పూర్  ఘటనలో యువతి  ధైర్యం చేసి  కోర్టు మెట్లు ఎక్కడం వల్లనే  ఒక పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం ‘No’  లేదా  ‘Not’ అనే  చిన్న పదాలను  చేర్చడం ద్వారా  వ్యక్తుల  భవిష్యత్తును  మార్చే అధికారం ఏ వ్యవస్థకూ లేదు. 

బాధ్యతాయుతమైన జర్నలిజం ఇలాంటి అక్రమాలను ఎండగట్టడం ద్వారానే  సమాజంలో  చైతన్యం వస్తుంది. పోలీసులు ప్రజలకు స్నేహితులుగా ఉండాలి. అంతే కానీ, సామాన్యుల  హక్కులను కాలరాసే హంతకులుగా మారకూడదు. ఈ కేసులో ఎస్సై సస్పెన్షన్ అనేది ఒక ఆరంభం మాత్రమే.  ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో పారదర్శకతకు,  జవాబుదారీతనానికి  పునాది కావాలి. 

ఉక్కల్కర్ రాజేందర్ నాథ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

 

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.