
- రాజస్థాన్ కు చెందిన ఇద్దరు అరెస్ట్, పరారీలో ఇద్దరు
ఎల్బీనగర్, వెలుగు : ర్యాపిడో రైడర్ల ముసుగులో డ్రగ్స్ సప్లయ్చేస్తున్న ఇద్దరిని సరూర్ నగర్, మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన రమేశ్ కుమార్(23), మహదేవ్ రామ్(25) అన్నదమ్ములు. ఉపాధి కోసం 2022లో సిటీకి వచ్చారు. ఎర్రగడ్డలోని గాయత్రినగర్ లో ఉంటూ ర్యాపిడో రైడర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ డ్రగ్స్ కు బానిసలయ్యారు. వీరి రూమ్లో ఉంటున్న రాజస్థాన్ కు చెందిన విక్రమ్ గోయల్, దినేశ్ కుమార్ ద్వారా రాజస్థాన్ లో తక్కువ ధరకు హెరాయిన్ దొరుకుతుందని తెలుసుకున్నారు.
సంపాదన సరిపోక ఈజీ మనీ కోసం నలుగురు కలిసి హెరాయిన్ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కొన్ని నెలలుగా రాజస్థాన్లో గ్రాము హెరాయిన్రూ.6 వేలకు కొని, సిటీలో రూ.12వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్, మేడిపల్లి పోలీసులు శుక్రవారం రమేశ్కుమార్, మహదేవ్రామ్ను అరెస్టు చేశారు. వారి నుంచి 34 గ్రాముల హెరాయిన్, బైక్, వేయింగ్ మిషన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్, దినేశ్ పరారీలో ఉన్నారు.