
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావుకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 2025, జూన్ 11న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సారి విచారణకు వచ్చేటప్పుడు గతంలో వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకురావాలని ఆదేశించారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు అందజేయాలని కోరారు. రెండు సెల్ ఫోన్లతో పాటు ప్రభాకర్ రావు వాడిన లాప్ టాప్, మ్యాక్ బుక్ తీసుకురావాలని ఆదేశించింది సిట్.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు సోమవారం (జూన్ 9) పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన పోలీసులు.. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఇవాళ్టి విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావుతో సంబంధాలతో పాటు ఎస్ఐబీ చీఫ్గా కార్యకలాపాలపై ప్రభాకర్ రావును విచారించారు.
ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ల ధ్వంసం తో పాటు డాటా మాయంపై ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పాత హార్డ్ డిస్క్లు తీసి కొత్త హార్డ్ డిస్క్లు ఎవరు చెప్పారంటూ ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు.