
సూర్యాపేట జిల్లాలో కొత్తగా 45 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి , సామెల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ , ఎస్పీ నరసింహ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. బస్సులు ప్రారంభించిన తర్వాత బస్సులో ప్రయాణించారు మంత్రులు,ఎమ్మెల్యేలు.
కాలుష్యం, డీజిల్ వాడకం తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈవీ బస్సులపై దృష్టి పెట్టింది. డీజిల్ వాహనాలను తగ్గించాలని ఇటీవల రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం సొంతంగానే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తోంది.
మహాలక్ష్మీ ఫ్రీ జర్నీ పథకం తెచ్చాక బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. బస్సులు సరిపోవడం లేదు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి.వాటిని రిపేర్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. అందుకనే కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది ప్రభుత్వం.